కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం
జిల్లా ప్రభుత్వ దవాఖానలో అన్ని ఏర్పాట్లు చేశాం
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ అర్బన్, మే 12 : కొవిడ్ సెకండ్ వేవ్ ఉధృతమవుతుండడతో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ రాష్ట్రంలో లాక్డౌన్ విధింపునకు నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్లో లాక్డౌన్ ఎలా కొనసాగుతున్నదో తెలుసుకునేందుకు అధికారులతో కలిసి బుధవారం పట్టణంలో పర్యటించారు. వర్తకులు, చిరు వ్యాపారులను కలిసి నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రోడ్లపై విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా బాధితులు వైద్యం కోసం ఆందోళన చెందవద్దన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు సరిపడా బెడ్లు, ఆక్సిజన్, ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
రోజూ నిజామాబాద్ నుంచి 20 ఆక్సిజన్ సిలిండర్లు ప్రభుత్వ దవాఖానకు తెప్పించి, కొవిడ్ బాధితులకు అందించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,77,697 గృహాల్లో జ్వర సర్వే నిర్వహించామని, ఇందులో ప్రాథమిక దశలో లక్షణాలు ఉన్న 2081 మందికి అక్కడికక్కడే కొవిడ్ కిట్లు అందించామని వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన ముందస్తు సర్వేతో ఎంతో మంది ప్రాణాలను రక్షించగలుగుతున్నామని చెప్పారు. అనంతరం పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా, అంబేద్కర్ చౌక్, బుధవార్పేట్, గాంధీచౌక్లో పర్యటించారు. లాక్డౌన్ స్థితిగతులు తెలుసుకున్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వెంట మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డాక్టర్ కృష్ణంరాజు తదితరులున్నారు.
అభివృద్ధి పనులతో పట్టణానికి కొత్త శోభ
పట్టణంలోని శివాజీ చౌక్ నుంచి గాజుల్పేట్ వరకు చేపడుతున్న సుందరీకరణ పనులతో కొత్త శోభ సంతరించుకుంటుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులను స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద పరిశీలించారు.దాదాపు రూ. 8 కోట్లతో సుందరీకరణ పనులను చేపట్టినట్లు తెలిపారు. అదనపు నిధులతో బౌల్ బజార్ వరకు పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలో ఆర్టీసీ బస్టాండ్ ఖాళీ ప్రదేశంలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు నూతన జిల్లాలో కొనసాగుతున్నాయని తెలిపారు.