హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూముల లావాదేవీల్లో ధరణి దూసుకుపోతున్నది. పోర్టల్ను ప్రారంభించి పదినెలలు పూర్తికాగా.. ఇప్పటివరకు ప్రభుత్వానికి రూ. వెయ్యి కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది అక్టోబర్ 29న ధరణిని సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు పోర్టల్ ద్వారా 10 లక్షలకు పైగా చెల్లింపులు జరిగాయి. ఫీజులు, రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో ప్రభుత్వానికి మొత్తంగా రూ.1087 కోట్ల ఆదాయం వచ్చింది. మరోవైపు పోర్టల్ను వీక్షించినవారి సంఖ్య 4.70 కోట్లు దాటింది.
రోజుకు రూ.5 కోట్ల ఆదాయం
ధరణి పోర్టల్లో ఇప్పటివరకు బుక్ అయిన స్లాట్ల సంఖ్య 9 లక్షలు దాటింది. సేల్, గిఫ్ట్, సక్సెషన్, పార్టిషన్తోపాటు నాలా, మార్ట్గేజ్, సంస్థల పేర్లమీద రిజిస్ట్రేషన్, పెండింగ్ మ్యుటేషన్, లీజ్, జీపీఏ వంటి సేవలకు స్లాట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇందులో ఇప్పటివరకు సుమారు 8.60 లక్షలకు పైగా లావాదేవీలు పూర్తయ్యాయి. పోర్టల్ ద్వారా రోజుకు సగటున నాలుగు వేలకుపైగా లావాదేవీలు జరుగుతున్నాయి. వాటి ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.4.5-5 కోట్ల వరకు ఆదాయం వస్తున్నది.