మహబూబ్నగర్ : ధరణి పోర్టల్ ద్వారా స్వీకరించిన క్లెయిమ్స్ అన్నింటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు తహసీల్దార్లను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుంచి తహసీల్దార్లతో ధరణిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐదు రోజుల పాటు పూర్తిగా ధరణి పై దృష్టి పెట్టాలని, 7వ తేదీలోగా ధరణి కింద ఉన్న ప్రతి క్లెయిమ్ ను పరిష్కరించేందుకు కృషి చేయాల్సిందిగా ఆదేశించారు.
అన్ని పనులకంటే ముందు ధరణి పెండింగ్ దరఖాస్తులన్నీటిని పరిష్కరించాలని చెప్పారు. ధరణి అంశాన్ని రాష్ట్రస్థాయిలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తోపాటు, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పెండింగ్ సమస్యలు, దరఖాస్తులను పరిశీలిస్తున్నారని తెలిపారు.
అందువల్ల వీటి పరిస్కారం పై తహసీల్దారులు ప్రత్యేక దృష్టి నిలపాలని అన్నారు. ధరణి రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనందున తహసీల్దార్లు ప్రతిరోజు 9 గంటలకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ మ్యుటేషన్లు, సక్సిషన్లు, దరఖాస్తులు అన్నింటికీ ఒక సమయాన్ని నిర్దేశించుకొని నిర్దేశించిన సమయం ప్రకారం పూర్తిచేయాలని చెప్పారు. ప్రతి సక్సేషన్ ను పంచనామా నిర్వహించి పరిష్కరించాలని తెలిపారు.
జిల్లాలో ధరణి కింద 2,527 కేసులు ఉండగా వాటన్నింటిని క్లియర్ చేయాలని చెప్పారు. అదేవిధంగా 49 సక్సేషన్ కేసులు ఉన్నాయని వాటిని కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రొహిబీటెడ్ భూములకు సంబంధించిన అప్లికేషన్ లపై మధ్యాహ్నం లోగా రికార్డులను పరిశీలించి అప్డేట్ చేయాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కె. సీతారామారావు, తేజస్ నందలాల్ పవర్, డీఆర్వో కె.స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ధరణి పోర్టల్ రైతులకు వరం : మంత్రి వేముల
తెలంగాణ వచ్చాకే కవులు, కళాకారులకు గుర్తింపు
మత్తడి దుంకుతున్న ప్రకాష్ నగర్ చెక్ డ్యాం