అమరావతి : ఏలూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల ప్రకటనకు గురువారం హైకోర్టు ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించిన విధంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపునకు అనుమతించింది.
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేశారని ఎన్నికలు వాయిదా వేయాలని మార్చి 8న దాఖలైన పిటిషన్పై ఎన్నికలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ విషయమై ఏపీ సర్కార్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్పై విచారణ జరిపి ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఎన్నికల ఫలితాలను మాత్రం వెల్లడించవద్దని మార్చి 9న ఆదేశించింది. ఏలూరు కార్పొరేషన్లో 50 డివిజన్లున్నాయి. వీటిలో 3 స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకొంది.
47 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. ఏలూరు కార్పొరేషన్లో ఫలితం ఎలా ఉంటుందనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.