నల్లగొండ : క్షుద్ర పూజల పేరిట ఓ మహిళను భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తిని నల్లగొండ రూరల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నల్లగొండ రూరల్ పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి వివరాలు వెల్లడించారు. మండలంలోని రంగారెడ్డినగర్కు చెందిన కుడుతాల మురళి 9 నెలల క్రితం అనుకోకుండా ఒక నంబర్కు ఫోన్ చేయగా.. మండలంలోని గుండ్లపల్లికి చెందిన అమ్మాయి మాట్లాడి పరిచయం అయింది.
అప్పటి నుంచి ఫోన్, మెసేజ్ చేసుకునేవారు. ఈ క్రమంలో మురళి అమెపై ఇష్టం పెరిగి ప్రేమిస్తున్నట్లు చెప్పగా అందుకామె ఒప్పుకోలేదు. కాగా, కొద్ది రోజుల క్రితం సదరు యువతికి వివాహం అయింది. దీంతో మురళి ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని, సంసారాన్ని చెడగొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో యూట్యూబ్లో, ఫేస్బుక్లో వీడియోల ఆధారంగా చేతబడి చేస్తే భయపడుతారని, పెండ్లితో ఇదంతా జరుగుతుందని కుటుంబ సభ్యులు భావించి విడిపోతారని అనుకున్నాడు.
ఈ నేపథ్యంలో జూన్ 18న కుంకుమ, పసుపు, జీడి గింజలు ఇంటి ముందు వేసి అమ్మాయి భర్తకు ఫోన్ చేసి బెదిరించాడు. మళ్లీ జూలై 6న రాత్రి 12 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనంపై వెళ్లి ఇంటి ముందు ఎముక, జాకెట్ ముక్కలు, బియ్యం, గాజులు, జీడి గింజలు, వెంట్రుకలు, నిమ్మకాయలు వేశాడు.
ఉదయాన్నే వాటిని చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సీసీ కెమెరాలు, ఫోన్ లొకేషన్ ఆధారంగా నిందితుడిని పట్టుకుని విచారణ చేసి సోమవారం రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
గోదావరిలో మునిగిన పురాతన శివాలయం
బైక్ను ఢీ కొట్టిన డీసీఎం..ఒకరి మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో
మేలో పెళ్లి.. తాజాగా ప్రెగ్నెంట్ అని ప్రకటించిన సాహోబ్యూటీ
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు