హైదరాబాద్, మే 29, (నమస్తే తెలంగాణ): ఓ రోగికి బ్లాక్ఫంగస్ మందులు సరఫరా చేస్తామని రూ.1.3 లక్షలు తీసుకుని మోసగించిన కేసులో సైబర్ నిందితులను తర్వగా పట్టుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైం సిబ్బందిని డీజీపీ ఎం మహేందర్రెడ్డి ఆదేశించారు. ధనుంజయ్ అవస్తి అనే వ్యక్తి తన తండ్రికి బ్లాక్ ఫంగస్ సోకిందని, ఇందుకు అవసరమైన మందులు సరఫరా చేస్తామని రూ.1.3 లక్షలు మోసగించారని, నిందితులను కఠినంగా శిక్షించాలని మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు. తక్షణమే స్పందించిన మంత్రి కేటీఆర్ తగిన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా డీజీపీని ఆదేశించారు. స్పందించిన డీజీపీ సైబర్ క్రైం సిబ్బందిని అప్రమత్తం చేశారు.