ఎదులాపురం, ఏప్రిల్ 25: రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా(టీ)లో ఆదివారం పలువురు ఎమ్మెల్యే జోగు రామన్న సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. చాందా(టీ) గ్రామంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.2 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. గ్రామంలో మిగిలిన పనులను త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు పేర్కొన్నారు. టీఆర్ఎస్ జడ్పీటీసీ అభ్యర్థి ఆరే నరేశ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సర్పంచ్ భాస్కర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్, నాయకులు సోనేరావు, పరమేశ్వర్, రమేశ్, జగదీశ్ పాల్గొన్నారు.