తెలుగుయూనివర్సిటీ, ఆగస్టు 24. సాహిత్య, సాంస్కృతిక రంగంలో ఉద్ధండుడైన దేవులపల్లి రామానుజరావు సమాజ వికాసానికి ఎంతో దోహదపడ్డారని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జీ చంద్రయ్య అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో డాక్టర్ దేవుపల్లి రామానుజరావు 104వ జయంతిని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవులపల్లి రామానుజరావు పేరిట ఏర్పాటు చేసిన సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కవి డాక్టర్ దేవరాజుకు ప్రదానం చేశారు. రూ.25 వేల నగదు, శాలువా, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ.. దేవులపల్లి రామానుజరావు మార్గంలో ఎదిగిన దేవరాజు మహారాజుకు పురస్కారం అందజేయడం సముచితమని అన్నారు. పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. న్యాయశాస్త్రంలో పట్టభద్రులైన రామానుజరావు న్యాయమూర్తిగా సేవలందించడంతో పాటు తెలుగుభాష వికాసం కోసం నెలకొల్పిన సారస్వత పరిషత్తుకు జీవితం అంకితం చేశారని గుర్తుచేశారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జే చెన్నయ్య మాట్లాడుతూ.. పరిషత్తుకు యాబై ఏండ్ల పాటు రామానుజరావు సేవలందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిషత్తు కోశాధికారి మంత్రి రామారావు, తదితర సాహితీవేత్తలు పాల్గొన్నారు.