కొడంగల్, మే 23: పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారి, పూర్తిస్థాయిలో స్వచ్ఛతతో పాటు అభివృద్ధిని సంతరించుకుంటున్నాయి. ప్రస్తుతం ఏ గ్రామాన్ని సందర్శించినా పల్లె ప్రకృతి వనాలతో పచ్చటి అందాలు, సుందరమైన సీసీ రోడ్లు, పంచాయతీ ట్రాక్టర్లతో డంపింగ్ యార్డ్లకు చెత్త తరలింపు, పురాతన భవనాల కూల్చివేత, పాడుబడ్డ బావుల పూడ్చివేతతో పాటు ఎల్ఈడీ లైట్లతో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. హుస్సేన్పూర్ గ్రామం నియోజకవర్గ కేంద్రానికి చేరువలో ఉంది. పచ్చటి పంట పొలాల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో ఉంటుంది. గతంలో ఈ గ్రామం ప్యాలమద్దికి అనుబంధంగా ఉండేది. కొత్త జీపీల ఏర్పాటులో భాగంగా హుస్సేన్పూర్ కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పడింది. అప్పట్లో చెత్త కుప్పలు, మురుగునీటితో నిండిన రోడ్లతో అపరిశుభ్రంగా కనిపించేది. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామ స్వరూపం మారిపోయింది. గ్రామంలో 583 మంది జనాభా ఉంది. పురుషులు 271, మహిళలు 312 మంది ఉన్నారు. 524 మంది ఓటర్లు, 134 నివాస గృహాలు ఉన్నాయి. గ్రామానికి నీటి సరఫరా కోసం 20వేల సామర్థ్యం గల మిషన్ భగీరథ ట్యాంకు నిర్మించారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి, నీటిని సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరాకు ఏదైనా అంతరాయం ఏర్పడితే అత్యవసర పరిస్థితుల్లో నీటిని సరఫరా చేసేందుకు బోర్లు కూడా ఏర్పాటుచేశారు. గ్రామానికి వెళ్లే ముందు పచ్చటి పంట పొలాలతో ఆహ్లాదకర వాతావరణం, బీటీ రోడ్లు స్వాగతం పలుకుతాయి.
14వ ఆర్థిక, రాష్ట్ర నిధులతో అభివృద్ధి
పల్లె ప్రగతిలో భాగంగా పంచాయతీకి 14వ ఫైనాన్స్ నిధుల కింద రూ.5లక్షల 9వేల 892, రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి రూ.5లక్షల 38వేల 349లు మంజూరు కాబడ్డాయి. ప్రతి నెలా పంచాయతీ నిర్వహణకు రూ.64 వేలు మంజూరు అవుతున్నట్లు పంచాయతీ సెక్రటరీ మల్లేశ్ తెలిపారు. ఈ నిధులతో పంచాయతీ సిబ్బంది, వేతనాలు, కరెంటు బిల్లు, మొక్కల సంరక్షణ మెయింటెనెన్స్, తాగునీటి పైప్లైన్ల మరమ్మతులు తదితర పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జీపీకి రూ.10లక్షల 48వేలతో అభివృద్ధి పనులు
గ్రామానికి రెండేండ్ల కాలంగా దాదాపు రూ.10లక్షల 48వేల పైగా నిధులు మంజూరై, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. రూ.9.50 లక్షలతో గ్రామానికి ట్రాక్టర్ కొనుగోలు, రూ.1.50 లక్షలతో రోడ్లుపై మట్టి పనులు, రూ.2.85లక్షలతో పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, కంపోస్టు షెడ్ వంటి అభివృద్ధి పనులు నిర్వహించారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద గ్రామంలో సీసీ రోడ్డు, వైకుంఠధామం నిర్మించారు. గ్రామంలో నివాస స్థలాల మధ్య మురుగుతో పెద్దగుంత ఉంది. దాన్ని మట్టితో పూడ్చేశారు. పల్లె ప్రకృతివనంలో 20 రకాలతో కూడిన 750 మొక్కలు, వాకింగ్ ట్రాక్, సేదతీరేందుకు బేంచీలు ఏర్పాటుచేశారు. ప్రతి రోజు మొక్కలకు నీటిని అందిస్తూ పచ్చటి వాతావరణాన్ని కాపాడుతున్నారు.
నర్సరీలో 11వేల మొక్కల పెంపకం
గ్రామంలో ఏర్పాటుచేసిన నర్సరీలో ప్రస్తుతం 11వేల మొక్కలు పెంతున్నట్లు సర్పంచ్ అనంతమ్మ తెలిపారు. గ్రామంలో హరితహారంలో భాగంగా 10వేల మొక్కలు నాటినట్లు తెలిపారు. పంట పొలాలు, చెరువు గట్లపై, నివాస గృహాల్లో, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ప్రస్తుతం 65 శాతం మొక్కలు బతికినట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు.