హైదరాబాద్ : రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరం అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. పల్లెలు, పట్టణాలను ప్రగతి పథంలో నడిపించేందుకు అంతా కంకణబద్దులు కావాలన్నారు. ఇందులో భాగంగా తాను కూడా ఓ జిల్లాను దత్తత తీసుకోనున్నట్లు సీఎం తెలిపారు. అదేవిధంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
సర్పంచులకు కిందిస్థాయి ఉద్యోగులకు తెలియని విషయాలను నేర్పిస్తూ, వారి సామర్ధ్యాలను పెంచుతూ వారిని గ్రామాభివృద్ధిలో భాగస్వాములను చేయాలని అదనపు కలెక్టర్లకు, డీపీవోలకు సీఎం వివరించారు. గ్రామాభివృద్ధిలో కేరళ ఆదర్శంగా నిలిచిందని కేరళ పర్యటనకు కొంతమంది అదనపు కలెక్టర్లను, డీపీవోలను ఎంపిక చేసి పంపాలని సీఎస్ను సీఎం ఆదేశించారు. ఢిల్లీ, తమిళనాడు ప్రభుత్వాలు అమలు చేస్తున్న కొన్ని పథకాలను తెలంగాణ కూడా ఆదర్శంగా తీసుకున్నదన్నారు. నేర్చుకోవడం నిరంతర ప్ర్రక్రియ అని తెలియని విషయాలను తెలుసుకోవడానికి అహంభావం కూడదని సీఎం హితవు పలికారు.
అధికారులు నిర్భీతిగా తమ బాధ్యతలను నిర్వర్తించాలని , ఎవరో ఒత్తిడి చేస్తున్నరనే మాట వినపడకూడదని సీఎం అన్నారు. మీ పని మీరు సమర్థవంతంగా చేయండి. మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీ వెంట సీఎం కేసీఆర్ ఉన్నడనే ధైర్యంతో పనిచేయండని అధికారులకు స్పష్టం చేశారు. అసాధ్యమనేది ఏదీ ఉండదు. గట్టిగా తలుచుకోవాలె. మనకు పల్లెలు, పట్టణాల అభివృద్ధిని మించిన మరో పని లేదు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని సీఎం ఆదేశించారు.
ఆర్ధిక వనరులున్నయి. ఉద్యోగ వ్యవస్థ ఉన్నది. ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండగా నిలుస్తున్నది. ఇంకేంగావాలె ? ఏ ప్రభుత్వమైనా ఇంతకన్నా ఎక్కువగా ఏం చేయగలుగుతుంది ? కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వ చర్యలకు గురికావద్దు సీఎం స్పష్టం చేశారు. పర్సనల్ అప్రేజల్ రిపోర్టును (పీఏఆర్) తయారు చేయడం ద్వారా కలెక్టర్ల పనితీరును రికార్డు చేస్తామన్నారు.