హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమం ఉత్సాహంగా సాగుతున్నది. నాలుగో రోజైన ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 2.67 లక్షల మొక్కలు నాటారు. నగరపాలక సంస్థలు, మున్సిపాల్టీల పరిధిలో ఇంటింటికీ 6 మొక్కల చొప్పున 2.66 లక్షల మొక్కలను పంపిణీ చేశారు. వీటితోపాటు మరో వెయ్యికిపైగా మొక్కలను అధికారులు నాటారు. 4,825 మీటర్ల మేర వేలాడుతున్న విద్యుత్తు వైర్లను సరిచేశారు. అధికారులు 1,282 దళితవాడల్లో పర్యటించి 134 పార్కులను శుభ్రం చేశారు. 2,673 టన్నుల చెత్తతోపాటు 1,574 టన్నుల వ్యర్థాలు, శిథిలాలను తొలగించారు. 1,591 కిలోమీటర్లలో రోడ్ల పక్కన ఉన్న పొదలను తొలగించారు. మురుగు కాలువల్లో 1,352 కిలోమీటర్ల మేర పూడికను తొలగించారు. దోమలు వ్యాపించకుండా 1,256 ప్రాంతాల్లో ఫాగింగ్ చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా గత నాలుగు రోజుల్లో మొత్తం 7.67 లక్షల మొక్కలు పంపిణీ చేయగా.. 4.79 లక్షల మొక్కలను నాటారు. 14,893 మీటర్ల మేర వేలాడుతున్న విద్యుత్తు వైర్లను సరిచేశారు. 5,763 కిలోమీటర్ల మురుగు కాలువల్లో పూడికను తొలగించారు.
మొక్కల బాధ్యత మీదే
పట్టణ ప్రగతిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలను అందజేస్తున్నామని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆమె మొక్కలు నాటారు.
– బడంగ్పేట
ప్రపంచానికే ఆదర్శం
సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం బండ్లగూడెంలో జరిగిన పల్లెప్రగతి గ్రామసభలో పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలోనూ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని సీఎం ఆపలేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజయ్య, కలెక్టర్ నిఖిల, సర్పంచ్ కాటం విజయ తదితరులు పాల్గొన్నారు. – లింగాలఘనపురం
చెట్లతో ఆరోగ్యం
హరితహారంలో భాగంగా ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని, చెట్లు ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మొక్కలు నాటి, నీళ్లు పోశారు. జిల్లాలో విరివిగా మొక్కలు నాటి హరితవనంగా మార్చాలని పిలుపునిచ్చారు. – మహబూబ్నగర్ టౌన్
గ్రామ స్వరాజ్యానికి బాటలు
పల్లెల అభివృద్ధితోనే గ్రామ స్వరాజ్యం సాధ్యమని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలో పల్లె ప్రగ తి, హరితహారం కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. స్థానిక విద్యుత్తు సబ్స్టేషన్, పందిపా డెలో అటవీశాఖ ప్లాంటేషన్లో మంత్రి మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలోని దళితవాడలో మంత్రి కాలినడన పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. – బయ్యారం
పట్టణాలు పచ్చదనంతో నిండాలి
పట్టణాలన్నీ పచ్చదనంతో నిండాలని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆకాక్షించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో ఆదివారం నిర్వహించిన పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో మంత్రి మొక్కలు నాటారు. ప్రతి కాలనీలో మొక్కలు నాటి హరితహారాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. – మేడ్చల్ కలెక్టరేట్