సంగారెడ్డి : ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని, రూపురేఖలు మారుతున్నాయని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, కోహిర్, జహీరాబాద్, మొగుడంపల్లి గ్రామాలలో అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. సదాశివపేట పట్టణంలోని ఉబ చెరువు సుందరీకరణ (మినీ ట్యాంక్ బండ్) ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సదాశివపేట పట్టణంలో సుమారు రూ. 20 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నట్లు తెలిపారు. చెరువు సుందరీకరణ, సెంట్రల్ లైటింగ్ సిస్టం, లైబ్రరీ భవన నిర్మాణం, వైకుంఠధామం, ముస్లిం, క్రిస్టియన్ స్మశాన వాటికలు నిర్మించుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా పిల్లల ఆట వస్తువులు మరిన్ని ఏర్పాటు చేయడానికి, వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు, గ్రానైట్తో కూర్చోవడానికి బల్లల కోసం కోటి రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్కు సూచించారు.
సదాశివపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ యార్డులో సమీకృత మోడల్ మార్కెట్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. ముస్లిం, క్రిస్టియన్ వాసుల అంతిమయాత్ర వాహనాలకు రూ. 15 లక్షల చొప్పున మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా హిందువుల వైకుంఠధామంలో పూర్తిస్థాయి సదుపాయాల కల్పనకు కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. రూ.45 కోట్లతో సదాశివపేట పట్టణంలో ఇంటింటికి తాగునీరు అందించేలా మంచినీటి పథకం ప్రారంభించామని, దీపావళి లోపు పనులు పూర్తి చేసి ప్రజలకు త్రాగునీరు అందిస్తామన్నారు.
పట్టణంలో కొత్త సీసీ రోడ్లు వేయడానికి, మురుగు కాలువలకు మరో రూ. 20 కోట్లు మంజూరు చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీలోగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. వచ్చే నెల నుండి 57 సంవత్సరాలు ఉన్న అర్హులకు ఆసరా పెన్షన్ లు ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ, శాసనమండలి ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు చింత ప్రభాకర్, మున్సిపల్ చైర్ పర్సన్ జయమ్మ, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ రాజర్షి షా, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.