జగిత్యాల : ప్రైవేటు విద్యా వసతులకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మంగళవారం కోరుట్ల నియోజకవర్గంలో బీటీ రోడ్లు, బ్రిడ్జీలు, విద్యుత్ సబ్స్టేషన్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి కొప్పుల ఈశ్వర్ ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యక్రమాల ప్రగతిపై దృష్టిసారించి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. రానున్న రోజులలో నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించడంలో మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించే దిశగా అడుగులు వేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిచేసుకోని సమృద్దిగా నీటి నిలువలు సమకూర్చుకోవడం జరిగిందన్నారు. ప్రగతి కార్యక్రమాల అమలులో కూడా మొదటిస్థానం పొందినట్లు తెలిపారు.
మొక్కబడిగా కాకుండా రూ. 5 లక్షల 5 వేలతో డబుల్ బెడ్ రూం నిర్మాణాలను కేటాయించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లే ఎవరి స్థలంలో వారే డబుల్ బెడ్ రూం కట్టుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ డబ్బులను వారి ఖాతాలోనే జమచేయనున్నట్లు చెప్పారు. ఆ దిశగా బడ్టెట్ రూ. 11 వేల కోట్లను మంజూరు చేసుకోవడం జరిగిందన్నారు. 57 సంవత్సరాలు నిండి, రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా వచ్చే నెల నుండి పించన్లను అందించేలా కృషి చేయడం జరుగుతుందని పేర్కోన్నారు.
మెట్లచిట్టాపూర్ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలిచిందన్నారు. ఒకప్పుడు నిజామాద్ జిల్లా అంకాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా చెప్పుకునే వారని, కానీ ఇప్పుడు జిల్లాలో అనేక గ్రామాలు ఆదర్శ గ్రామాల వైపు పయనిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత, గ్రామ సర్పంచ్ గంగరాజు, ఎంపీపీ తోట నారాయణ, జెడ్పీటీసీ లావణ్య, ఎంపీటీసీ విజయ, రైతు సమన్వయ సమితి అద్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.