హుజూరాబాద్, మే 22: భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తమ కులస్థులకు చేసింది ఏమీలేదని ముదిరాజు సంఘం కరీంనగర్ జిల్లా నాయకుడు నిమ్మ రాజయ్య మండిపడ్డారు. శనివారం హుజూరాబాద్లో సంఘ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈటల ఏనాడూ ముదిరాజు కులస్థుడనని చెప్పుకోలేదని, ఆయనకు ఆపద వచ్చిన సమయంలోనే సామాజికవర్గం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆగ్రహించారు. నిజంగా ముదిరాజులపై ప్రేమ ఉంటే ఏ ఒక్కరికైనా వారి పరిశ్రమల్లో ఉద్యోగం కల్పించారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేరదీసి పార్టీలో, ప్రభుత్వంలో పదవులు అప్పగిస్తే చివరికి ఆయనకే ద్రోహంచేయాలని చూశారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఉచితంగా అందజేసిన చేప పిల్లలతో ముదిరాజ్లు అభివృద్ధి చెందారని చెప్పారు. సమావేశంలో నాయకులు రెడ్డబోయిన ఐలయ్య, గూళ్ల మొగిళి, నిమ్మ సమ్మయ్య, వలుగు మొగిళి, రవి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.