హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్ర మం) కింద ఇప్పటివరకు రూ.1,946.90 కోట్లు ఖర్చు చేసి, 22 పనులను పూర్తిచేశామని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. రూ.5,693.51 కోట్ల తో చేపట్టిన మరో 24 పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు కేపీ వివేకానందగౌడ్, సుధీర్రెడ్డి, అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిస్తూ ‘హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సీఎం ఆలోచనకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ఎస్సార్డీపీ కార్యాచరణ చేపట్టాం. తొలిదశ లాక్డౌన్ సమయంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సిబ్బంది అహోరాత్రులు కష్టపడి కొత్త లింక్రోడ్లు, బైపాస్లు, కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని పూర్తిచేశారు. జీహెచ్ఎంసీకి డబ్బు మిగల్చాలనే ఉద్దేశంతో ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) తెచ్చి రూ.3,000 కోట్లు ఆదా చేశాం. ఎస్సార్డీపీతో దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, బాలానగర్ బ్రిడ్జిని నిర్మించాం. ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీకి కొత్త స్టీల్ బ్రిడ్జి కడుతున్నామ’ని వెల్లడించారు. బహదూర్పురా దగ్గర వంతెన నిర్మాణం ఏజెన్సీ నిర్ల క్ష్యం కారణంగా ఆలస్యమైందని.. ఈ పను లు వేగవంతం చేయడానికి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో చర్చించామని చెప్పారు. పాతబస్తీలోని పలు ఫ్లైఓవర్లు, ఆర్వోబీల నిర్మాణానికి రూ.1,545 కోట్లతో వివిధ దశల్లో పనులు చేస్తున్నామన్నారు. ఒక రోడ్డును అభివృద్ధి చేస్తే ఆర్థిక కార్యకలాపాలు పెరగటంతోపాటు, ట్రాఫిక్ తగ్గి, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు లభిస్తాయని తెలిపారు. ఖర్చుచేసే ప్రతి రూపాయినీ పెట్టుబడిగా చూడాలన్నారు.
ఔటర్ చుట్టూ హెచ్యూఏ ప్రణాళిక
ఓఆర్ఆర్కు బయట 2 కిలోమీటర్ల దూరం వరకు హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్(హెచ్యూఏ) పేరుతో ట్రాఫిక్ ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి, 132 లింక్రోడ్లను చేపట్టి అందులో ఇప్పటికే 24 పూర్తి చేశామన్నారు. రూ.850 కోట్లతో వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
జూట్ మిల్లులకు ప్రోత్సాహం
రాష్ట్రంలో జనపనార మిల్లుల ఏర్పాటుకు మూడు కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని కేటీఆర్ చె ప్పారు. వరంగల్ జిల్లాలో గ్లాస్టర్స్ లిమిటెడ్, రాజన్న సిరిసిల్లలో ఎంబీటీ కమోడిటీస్, కామారెడ్డ్లిలో కాళేశ్వరం ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్లను ఏర్పాటుచేస్తున్నట్టు పేర్కొన్నారు. వీటిద్వారా ప్రత్యక్షంగా 10,448 మందికి, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సభ్యుడు సురేందర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ యూనిట్లు ఉత్పత్తిచేసిన గోనె సంచులను 20 ఏండ్లపాటు కొనుగోలు చేసే పూచీకత్తును ప్రభుత్వమే ఇస్తుందన్నారు. రెండు వరి పంటల మధ్య మూడోపంటగా జనుమును పండించే రైతులతో ఒప్పందం చేసుకొనేందుకు సదరు కంపెనీలకు అవకాశం కల్పిస్తుందన్నారు.