కరీంనగర్ : జమ్మికుంట పట్టణం ఒక వ్యాపార కేంద్రం అయినప్పటికీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోలేదని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మున్సిపాలిటీలో పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రూ. 31 కోట్ల 33 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
రాష్ట్రంలో మిషన్ భగీరథ పనులు పూర్తి అయి నీరు అందుతుంటే ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. రైతులకు సంబంధించిన రైతు బంధు కావచ్చు, దళితులకు సంబంధించిన దళిత బంధు కావచ్చు ఇవి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కడు పేదరికంలో ఉన్న ఎస్సీలను ఒక ఉద్యమం లాగానే యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అదీ హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఫైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
దళిత బంధు పథకంపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. దళిత బంధు పథకాన్ని నూటికి నూరు శాతం విజయంవంతం చేసి చెంపపెట్టు లాగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. బీజేపీకి ఓటెందుకు వేయాలని మంత్రి ప్రశ్నించారు. రైతుల మీద కొత్త చట్టం తీసుకొచ్చినందుకా ? ధాన్యం కొనుగోలు చేయొద్దు కల్లాలు ఎత్తివేయాలని ఆంక్షలు విధించినందుకా ? కరెంట్ను ప్రైవేటుపరం చేసి వ్యవసాయ బావులకు మీటర్లు పెడతాం అన్నందుకా ? జీఎస్టీ తెచ్చినందుకా ? పెద్ద నోట్లు రద్దు చేసినందుకా ? నిరుద్యోగులకు ఒక్కోక్కరికీ జన్ ధన్ ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తాం అని వేయనందుకా ? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మున్సిపాలిటీ ఛైర్మన్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.