హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): వర్షాకాలం వచ్చిందంటే చాలు తెలంగాణలోని గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలు వైరల్ జ్వరాలతో సతమతమయ్యేవి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవారు. ఒకవైపు పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం సరిగాలేక వ్యాధులు విజృంభిస్తే, మరోవైపు సరైన వైద్యం అందక తల్లడిల్లేవారు. స్వరాష్ట్రంలో ఇవన్నీ కనుమరుగయ్యాయి. వైద్యం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విప్లవాత్మక విధానాలు అద్భుత ఫలితాలను రాబడుతున్నాయి. రాష్ట్రంలో అమలుచేస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా కనిపిస్తుండగా, సీజనల్ వ్యాధులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన రెండేండ్లలో మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, మెదడువాపుతో ఒక్కమరణం సంభవించకపోవడమే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2017 నుంచి ఇప్పటివరకు మలేరియా కారణంగా ఒక్కరుకూడా మృతి చెందలేదు. డెంగ్యూతో 2018లో 2, 2019లో ఏడుగురు మృతి చెందగ.. ఆ తర్వాత రెండేండ్లలో ఒక్క మరణం నమోదు కాలేదు.
వినూత్న కార్యక్రమంతో సత్ఫలితాలు
సమగ్రాభివృద్ధి లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేశారు. వివిధ నివారణ చర్యల కారణంగా రోగాలను వ్యాప్తిచెందించే దోమలు, ఈగలు ఇతర కీటకాల సంతతి తగ్గిపోయింది. పరిశుభ్రత వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించడం వల్ల ప్రజల జీవన విధానంలోనూ మార్పు వచ్చింది. ఈ కారణాల వల్ల వర్షాకాలంలో విజృంభించే మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా వంటి సీజనల్ రోగాలు తగ్గిపోయాయి. మరోవైపు వైద్యారోగ్యశాఖ తీసుకుంటున్న ప్రత్యేక యాక్షన్ ప్లాన్ వల్ల రోగాలు వచ్చిన వారు ప్రాణాలు కోల్పోకుండా కాపాడటం సాధ్యమైంది.
మలేరియారహిత రాష్ట్రంగా తెలంగాణ
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల వల్ల దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి జబ్బులు గణనీయంగా తగ్గాయి. మలేరియా, డెంగ్యూ మరణాలు పూర్తిగా నివారించబడ్డాయి. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు మలేరియా ప్రీ ఎలిమినేషన్ దశ-2 నుంచి ఎలిమినేషన్ దశ-1కు చేరుకున్నాం. త్వరలోనే మలేరియా రహితరాష్ట్రం (క్యాటగిరి జీరో)గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
డాక్టర్ జీ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు