పల్లెపల్లెన పల్లేర్లు మొలిసె తెలంగాణలోనా అని పాడుకొన్న ఈ నేలపై.. నేడు పచ్చని వనాలు కనిపిస్తున్నాయి. గతుకులతో డ్యాన్స్ చేయించిన రోడ్లన్నీ అద్దంలా మెరిసిపోతున్నాయి. గబ్బు పట్టిన మోర్లన్నీ అండర్ డ్రైనేజీలయ్యాయి. వీధుల్లో పెంటకుప్పలు పోయి పారిశుద్ధ్యం పరిమళిస్తున్నది. ఊరికో నర్సరీ వచ్చింది. ఎల్ఈడీ వెలుగులు జిగేల్మంటున్నాయి. పాడుబడ్డ బావులు కానరాకుండా పోయాయి, కూలిపోయే ఇండ్లన్నీ నేలమట్టమయ్యాయి. చెత్త కోసం ట్రాక్టరు వచ్చింది. ఆ చెత్తంతా సేంద్రియ ఎరువుగా మారింది. మొక్కలన్నీ చెట్లుగా మారుతున్నాయి. వాటి దాహం తీర్చే నీళ్ల ట్యాంకరు వచ్చింది. చచ్చినా నరకం అనుభవించిన చోట వైకుంఠధామం వెలిసింది. ఇదీ పల్లెప్రగతితో తెలంగాణ సాధించిన విజయం.. తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ గెలుపు. – నమస్తే తెలంగాణ నెట్వర్క్
నాటి రాళ్లగుట్టే.. నేటి రాక్గార్డెన్
పనికిరాదనుకొన్న రాళ్ల గుట్టను రాక్గార్డెన్గా మార్చుకొన్నారు జనగామ జిల్లా శామీర్పేట గ్రామ ప్రజలు. ఈ ఊరిలో చేపట్టిన ప్రగతి పనుల్లో ఇదే హైలైట్. పెద్ద రాళ్లను తొలగించి, అవసరం ఉన్న బండలను ఆకర్షణీయంగా మలిచారు. ప్రతి రాయిపై అందమైన చిత్రాలు గీయించారు. సందేశాత్మక సూక్తులు రాయించారు. గుట్ట చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటుచేసుకొన్నారు. ట్రాక్కు ఇరువైపులా రంగురంగుల పూలు, పండ్ల మొక్కలను పెంచి గుట్టనే పార్కుగా మార్చేశారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, సీసీ కెమెరాలు, వాడవాడలా సీసీ రోడ్లు, ప్రధాన వీధుల్లో ఎల్ఈడీ లైట్లతో గ్రామం వెలిగిపోతున్నది.
వందశాతం పన్ను వసూళ్లు
ఇద్దరు మల్టీపర్పస్ వర్కర్లు.. ఏరోజు ఏ వర్కర్ ఎక్కడ డ్రైనేజీలు, వీధులు శుభ్రం చేయాలి.. పనిచేసిన ప్రాంతంలో స్థానికుల సంతకం తీసుకోవాలి.. దానికోసం ఒక ప్రత్యేక టైం టేబుల్. ఇదీ నల్లగొండ జ్లిలా గుట్టకింది(జీకే) అన్నారం గ్రామం క్రమశిక్షణ. ఒక్క శానిటేషన్లోనే కాదు.. ప్రతి పనిలో నిబద్ధత చూపిస్తుందీ ఊరు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పల్లెప్రగతితో గ్రామం ఓడీఎఫ్గా గుర్తింపుపొందింది. వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్డు, సీసీరోడ్లు, ఇంటింటికీ ఇంకుడుగుంతలు, ఆహ్లాదాన్ని పంచే పల్లెప్రకృతివనం, ఎల్ఈడీ వెలుగులు.. ఇలా ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఈ గ్రామంలో మూడేండ్లుగా వందశాతం పన్నులు వసూలు అవుతున్నాయి.
మనసు మురిసేలా మల్లేపల్లి
అభివృద్ధికి కేరాఫ్ అనేలా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి దూసుకుపోతున్నది. గ్రామంలో ఏ మూలన చూసినా మట్టిరోడ్డు కనిపించదు. ఎక్కడా మురికి నీరు రోడ్లపై ప్రవహించదు. ఊరంతా సీసీరోడ్లే. అన్నివాడల్లో డ్రైనేజీ వ్యవస్థ ఉన్నది. వచ్చే ఏడాది నాటికి ఈ ఊరంతా అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుచేసుకోనున్నది. ఈ ఊరిలో ప్రకృతి వనం ఆహ్లాదాన్ని పంచుతున్నది. పట్నాల్లో ఉండే అత్యాధునిక పార్కులా కనువిందు చేస్తున్నది. గ్రామంలోకి ప్రవేశిస్తుంటే రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు స్వాగతం పలుకుతున్నట్టు కనిపిస్తాయి. ఈ ఊరిలో మరో ప్రత్యేకత ఏంటంటే.. 40 రకాల ఔషధ మొక్కలతో చిన్నపాటి వనం ఉంది. మొత్తం మల్లేపల్లిలో నాలుగు పార్కులు ఉండటం విశేషం. అదంతా పల్లెప్రగతి పుణ్యమే అంటారు ఆ గ్రామప్రజలు.
అభివృద్ధికి కేరాఫ్.. కెరెళ్లి
ఒకప్పుడు ఆ ఊర్లో అన్నీ బురద రోడ్లే.. ఎక్కడపడితే అక్కడ దోమలు, పందులు, తేళ్లు, పాముల సంచారమే. పల్లెప్రగతితో ఆ ఊరు రూపురేఖలే మారిపోయాయి. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కెరెళ్లి అభివృద్ధి గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ప్రభుత్వ ఆర్థిక అండ, ఇక్రిశాట్లో పదవీ విరమణ చేసిన సర్పంచ్ ఉండటంతో గ్రామం అనతికాలంలోనే ప్రగతి ఫలాలను అందుకొన్నది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, గల్లీ గల్లీలో సీసీ రోడ్లు నిర్మించారు. ప్రతి ఇంటిముందు పచ్చని చెట్టు కచ్చితంగా ఉంటుంది. డంపింగ్యార్డు, వైకుంఠధామం, వర్మీ కంపోస్టు షెడ్డు, రైతువేదిక, ఇంటింటికి మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు.. ఇలా గ్రామం అభివృద్ధికి చిరునామాగా మారింది.
పల్లెనిండా ప్రశాంతత
సిమెంట్ కర్మాగారాలు, స్టీల్ ఫ్యాక్టరీలకు ముడి సరుకులకు, ఎర్రమట్టికి నెలవుగా ఉన్న ములుగు జిల్లా మల్లపల్లి గ్రామం పల్లెప్రగతితో అభివృద్ధి సాధించి జిల్లాలోని 173 పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఇక్కడ నర్సరీ, పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్డు, డంపింగ్ యార్డు, శ్మశానవాటిక నిర్మాణ పనులు 100 శాతం పూర్తయ్యాయి. గ్రామంలో పారిశుద్ధ్య పనులకు 17 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారికి నెలనెలా ఇచ్చే జీతాలే రూ.1.5 లక్షలు. ఈ ఊరిలో అడుగుపెడితే జాతీయభావం కూడా పెంపొందుతుంది. ప్రకృతివనంలో ఫెన్సింగ్ స్తంభాలకు జాతీయ పతాక చిహ్నాన్ని పెయింటింగ్ వేయించారు.
ఆ ఊరిలో 37 రోడ్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం 4 ఇన్ైక్లెన్ పంచాయతీ ఇప్పుడు ఎంతోమంది నోళ్లల్లో నానుతున్నది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి వల్లే ఇదంతా. ఎంత అభివృద్ధి జరిగింది అంటే.. ఈ ఫొటోనే నిదర్శనం. ఊరిలో మొత్తం 37 రోడ్లు వేసుకొన్నారు. గతంలో 3 ఇన్ైక్లెన్ పంచాయతీలో కలిసి ఉన్న ఈ ఊరు కొత్త పంచాయతీగా మారింది. గ్రామానికి నిధులు వరదలా వచ్చాయి. పల్లె ప్రగతితో ఈ ఊరికి ప్రకృతి వనం, చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్, నీళ్ల ట్యాంకర్, వైకుంఠధామం, అక్కడే స్నానాలకు నీటి సదుపాయం.. ఇలా ఊరంతా కళకళలాడుతున్నది.
ఆఖరి మజిలీ ప్రశాంతంగా..
ఇది నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నారాయణపురంలోని వైకుంఠధామం. ఇక్కడ పల్లెప్రగతికి ముందు శ్మశానవాటిక లేదు. ఊర్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేయాలంటే నానాతంటాలు పడాల్సి వచ్చేది. రోడ్డుపక్కన, గుట్టకు తీసుకుపోయి కాల్చాల్సి వచ్చేది. చావుకు వెళ్లినవారు స్నానాలు చేయాలంటే గగనమే. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లు. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండేది. ఇప్పుడు ఆ గ్రామంలో చెత్త కంటికి కనిపించదు. పల్లెప్రగతిలో భాగంగా రూ.12లక్షలతో వైకుంఠధామాన్ని నిర్మించారు. దీంతో చనిపోయినవాళ్లకు గౌరవప్రదంగా దహనసంస్కారాలు జరుగుతున్నాయి. రూ.2.50 లక్షలతో డంపింగ్ యార్డు, రూ.6 లక్షలతో పల్లె ప్రకృతివనం, రూ.45 వేలతో నర్సరీ ఏర్పాటైంది.
నడికుడ.. సరికొత్త నడవడి
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఎస్సారెస్పీ పునరావాస గ్రామం.. నడికుడ. ప్రగతి అంటే ఇలానే ఉండాలని నిరూపిస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, కంపోస్ట్ షెడ్డు నిర్మాణాలు పూర్తి చేసుకొన్నదీ గ్రామం. ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే రూ.500 జరిమానా విధిస్తామని ఏకగ్రీవంగా తీర్మానించారు. దీంతోపాటు అన్ని పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించారు. పల్లె ప్రగతి పనులతోపాటు గ్రామ ప్రజల పనితీరుతో జిల్లా స్థాయి ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుకు నడికుడ ఎంపికైంది.
హరిత ‘సింగారం’
నాడు రోడ్లు లేవు.. నేడు సీసీ రోడ్లు. నాడు ఖాళీ జాగాల్లో పెంట కుప్పలు, పిచ్చి మొక్కలు.. నేడు హరితవనాలు. ఇదీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కాచవాని సింగారంలో నాటి, నేటి పరిస్థితి. పల్లె ప్రగతిలోభాగంగా పార్కులు, డ్వాక్రా కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, ప్రహరీలు, వైకుంఠధామం, డంపింగ్ యార్డు, నర్సరీలు ఏర్పాటుచేసుకొని గ్రామాన్ని పట్నంలా తీర్చిదిద్దుకొన్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల్లో 54,100 మొక్కలు ఏపుగా పెరిగి చెట్లుగా మారాయి. గ్రామంలో జరిగిన అభివృద్ధిని చూసి ముచ్చటపడ్డ సర్కారు ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికచేసింది.
ఆకుపచ్చని కౌటాల
పల్లె ప్రగతితో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలకేంద్రం రూపురేఖలే మారిపోయాయి. ఇక్కడి పల్లెప్రకృతివనం సందర్శకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ ఏ గల్లీ చూసినా సిమెంట్ రోడ్డే కనిపిస్తుంది. ఇందుకోసం దాదాపు రూ.70లక్షలు వెచ్చించారు. రూ.12 లక్షలతో వైకుంఠధామం, రూ.1.15లక్షలతో డంపింగ్ యార్డు, రూ.2 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించుకొన్నారు. వీధులన్నీ పరిశుభ్రంగా మారాయి. పల్లెప్రగతితోనే గ్రామం పచ్చగా మారిందని అక్కడి ప్రజలు గొప్పగా చెప్పుకొంటున్నారు.
చందన్వెల్లి చమక్కులు
ఊర్లోకి ప్రవేశించగానే రోడ్డుకు రెండు పక్కల మొక్కలు, అద్దంలా మెరిసే రోడ్లు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీ, వందశాతం మరుగుదొడ్లు, డంపింగ్ యార్డు.. ఇలా పల్లె ప్రగతిలోని ప్రతి పనినీ పూర్తిచేసి అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రశంసలు అందుకొంటున్నది రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్వెల్లి గ్రామం. పల్లెప్రగతి కార్యక్రమంలో ఈ గ్రామపంచాయతీ ముందువరుసలో నిలిచింది. నాగర్గూడ-శంషాబాద్ వెళ్లే ప్రధాన రహదారి నుంచి మొదలుకొని ఊర్లోకి వెళ్లే వరకు, ఊరంతా ఎక్కడ చూసినా రోడ్లకు ఇరువైపులా మొక్కలతో పచ్చదనం దర్శనమిస్తున్నది.