హైదరాబాద్ : గల్ఫ్ దేశాల్లో తప్పిపోయిన తెలంగాణ వాసుల ఆచూకీని కనుగొని తిరిగి స్వదేశం తీసుకురావాల్సిందిగా కోరుతూ టీఆర్ఎస్ ఎంపీ కె.ఆర్.సురేష్రెడ్డి నేతృత్వంలోని బృందం కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్కు విజ్ఞాపన పత్రం అందజేసింది. ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో గురువారం సాయంత్రం కలిసిన వీరు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. తప్పిపోయిన వారి వివరాలను ఈ సందర్భంగా అందజేశారు.
అనేక సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లా వాసులు గల్ఫ్ దేశాలకు ఉపాధికై వెళ్తున్నారు. కాగా అక్కడికి వెళ్లిన తర్వాత వారి వద్ద నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారిని వెతికి స్వదేశానికి రప్పించాల్సిందిగా కోరారు. సావధానంగా ప్రతి వ్యక్తి వివరాలు చదివిన మంత్రి ఆయా దేశాలలో ఉన్న ఇండియన్ ఎంబసీలకు ఆదేశాలు పంపిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బృందం మంత్రితో పలు అంశాలపై చర్చించింది.
కేంద్ర మంత్రిని కలిసిన వారిలో సురేష్ రెడ్డితో పాటు, ప్రవాస భారతీయ హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షులు కోటపాటి నరసింహం నాయుడు, మలేసియా తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు శాంతి ప్రియ ఉన్నారు.