చిట్యాల, జూన్ 25: భూమి సర్వే రిపోర్ట్ కోసం రూ.10 వేలు లంచం తీసుకుంటూ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ల్యాండ్ సర్వేయర్ రాములు ఏసీబీకి చిక్కారు. ఏసీబీ అధికారులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్కు చెందిన రావుల సాయిరెడ్డికి గ్రామ శివారులో 6.37 ఎకరాల సాగుభూమి ఉన్నది. రికార్డు ప్రకారం ఉన్న భూమి కాస్తులో లేదని గత పదేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్ట్టూ తిరుగుతున్నారు. అతడి కుమారుడు శ్రావణ్కుమార్రెడ్డి భూ సర్వే కోసం మీసేవలో ఎఫ్లైన్(ఎంసీ) దరఖాస్తు చేశారు. చిట్యాల సర్వేయర్ పావని, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ రాములు పక్షం రోజుల క్రితం సర్వే చేశారు. అయితే సర్వే రిపోర్ట్ కోసం వెళ్తే రూ.40 వేలు డిమాండ్ చేశారు. శుక్రవారం హన్మకొండలోని రాములు ఇంటికి వెళ్లి రూ.10 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అలాగే సర్వేయర్ పావనికి సంబంధించి పరకాలలోని ఆమె ఇంట్లోనూ సోదాలు చేశారు. చిట్యాల తాసిల్ కార్యాలయంలోనూ సోదాలు చేసి సర్వే రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
గంగాధర, జూన్ 25: లంచం తీసుకుంటూ కరీంనగర్ జిల్లా గంగాధర ఏఎస్సై శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మండలంలోని లింగంపల్లికి చెందిన కొత్త బీరయ్య, జుర్రు రాజమల్లుకు మధ్య గొడవ జరిగింది. ఈనెల 10న రాజమల్లు తనపై దాడి చేశాడని బీరయ్య గంగాధర పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఏఎస్సై చంద్రారెడ్డి కేసు విచారణలో భాగం గా రాజమల్లు ఇంటికి వెళ్లి స్టేషన్కు రావాలని, లేకుంటే రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఏఎస్సై చంద్రారెడ్డి శుక్రవారం స్టేషన్లో రాజమల్లు నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదుచేసి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు.