హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వానకాలం సాగు ప్రణాళికను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. మొత్తం 1.40 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసింది. గత వానకాలంతో పోల్చితే ఈసారి 5 లక్షల ఎకరాల్లో అధికంగాత పంటలు సాగవుతాయి. ఈ ఏడాది కూడా పత్తి పంటకే ప్రథమ ప్రాధాన్యమిచ్చింది. ముఖ్యంగా వరి సాగు తగ్గించి.. పత్తి సాగు పెంపుపై ప్రధానంగా దృష్టి పెట్టింది. 70 లక్షల ఎకరాల్లో పత్తి, 41.85 లక్షల ఎకరాల్లో వరిని, 20 లక్షల ఎకరాల్లో కందిని సాగుచేయాలని సూచించింది. ఇక గత వానకాలంతో పోల్చితే సుమారు 5 లక్షల ఎకరాలు ఎక్కువగా సాగవుతుందని అంచనా వేసింది.
పత్తి, కంది పది లక్షల ఎకరాలు ప్లస్
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే పండించాలనే సీఎం కేసీఆర్ సూచనకు అనుగుణంగా వ్యవసాయశాఖ వానకాలం సాగు ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులోభాగంగానే వరిని తగ్గించి పత్తి, కంది సాగును పెంచింది. సీఎం కేసీఆర్ సూచనల నేపథ్యంలో వ్యవసాయ శాఖ కూడా పత్తి, కంది పంటలకు టాప్ ప్రియారిటీ ఇచ్చింది. రెండుపంటలనూ పది లక్షల ఎకరాల చొప్పున పెంచింది. గత వానకాలంలో పత్తి 60.53 లక్షల ఎకరాల్లో సాగు కాగా ఈసారి 70 లక్షల ఎకరాల్లో సాగవుతుందని పేర్కొన్నది. కందిని 10.84 లక్షల ఎకరాల నుంచి 20 లక్షల ఎకరాలకు పెంచింది. గత వానకాలంలో పత్తి, కంది పంటలను రైతులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారమే సాగుచేశారు.
వరికి ప్రత్యామ్నాయంపై అవగాహన
వరిసాగు విస్తీర్ణాన్ని ఈ వానకాలంలో గణనీయంగా తగ్గిస్తూ వ్యవసాయశాఖ నిర్ణయం తీసుకున్నది. గత వానకాలంలో 53.33 లక్షల ఎకరాల్లో సాగయిన వరిని ఈసారి ఏకంగా 11.50 లక్షల ఎకరాలు తగ్గించింది. తెలంగాణలో సాగునీటి వసతి పెరగడంతో రైతులంతా ఏకపక్షంగా వరినాట్లు వేస్తున్నారు. దీంతో ధాన్యం దిగుబడి భారీగా పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో ధాన్యం మార్కెటింగ్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వానకాలంలో వరి సాగును వీలైనంత మేర తగ్గించేందుకు వ్యవసాయశాఖ యత్నిస్తున్నది. వరికి బదులుగా ఇతర పంటలను సాగుచేయడంపై ఏఈవోలు, ఎంఏవోలతో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. వరికి ప్రత్యామ్నాయాలేమిటి? ఆయా పంటల సాగుతో వచ్చే లాభాలను వివరిస్తున్నారు. ఒకవేళ వరి తప్పని పరిస్థితుల్లో సన్నాలను సాగుచేసేలా అవగాహన కల్పిస్తున్నారు.
విత్తన కొరతతో తగ్గిన సోయాబీన్
గత సీజన్తో పోల్చితే సోయాబీన్ సాగు అంచనాలు భారీగా తగ్గాయి. గత వానకాలం 4 లక్షల ఎకరాల్లో సాగైన ఈ పంటను 1.33 లక్షల ఎకరాలకు తగ్గించారు. గత వానకాలంలో అకాల వర్షాలు, భారీ వర్షాలతో రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా సోయాబీన్ పంట పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో విత్తనాలకు భారీగా కొరత ఏర్పడింది. దేశంలో ఎక్కడా విత్తనాలు లభించని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే సోయాబీన్ పంట వేయాలనుకొనే రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని అధికారులు సూచిస్తున్నారు.
సాగు సందడి షురూ
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వానకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తం గా బుధవారం మోస్తరు వర్షం పడగా.. గురువారం ఉదయం నుంచి రైతులు జిల్లా కేంద్రంలోని విత్తన దుకాణాలకు క్యూ కట్టారు. రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో దుకాణాలు, మార్కెట్ ప్రాంతం రద్దీ కనిపించింది. ఇప్పటికే సాగుకు భూములు సిద్ధం చేసిన రైతులు వర్షాలు పడగానే పత్తి విత్తనాలు వేయనున్నారు.