హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లలో ఏటా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడంపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. ఈ సీజన్లో ఎంతమొత్తంలో ధాన్యం ఉత్పత్తి అవుతుంది? అందులో రైతు తమ అవసరాల కోసం ఎంత ఉంచుకుంటాడు? మార్కెట్కు తరలించేది ఎంత? వంటి లెక్కలను తీసే పనిలో పడింది. ఇందుకోసం ప్రతిగ్రామంలో ప్రత్యేకంగా సర్వే నిర్వహించాలని వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో)లను ఆదేశించింది. మార్కెట్లకు ఎంత ధాన్యం వచ్చే అవకాశం ఉందో పరిశీలించి.. అందుకనుగుణంగా కొనుగోళ్లపై అంచనాకు రానున్నది. రైతులు క్షేత్రస్థాయిలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేశారో లెక్కించి.. అందుకు అనుగుణంగా దిగుబడి అంచనా వేస్తున్నారు. అయితే, పంట మార్కెటింగ్ సమయంలో అంచనాలు తలకిందులవుతున్నాయి. ఈ వ్యవస్థను సరి చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికితోడు ఎఫ్సీఐ ఈ సీజన్లో 60 లక్షల టన్నులకు మించి దొడ్డు వడ్లను కొనుగోలు చేసేది లేదని.. యాసంగిలో అసలే కొనబోమని తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. రైతులు వానకాలంలో సన్నాలను, యాసంగిలో దొడ్డు రకాలను ఎక్కువగా సాగు చేస్తారు. సన్నాలను మెజార్టీ ఇంటిఅవసరాలకు ఉపయోగించుకుంటారు. దొడ్డు వడ్లు మాత్రం పూర్తిగా మార్కెట్లకే తరలిస్తారు. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్రంలో వాస్తవంగా ఎంత విస్తీర్ణంలో వరి సాగైంది? సన్నాలు, దొడ్డు రకాల సాగు ఎంత? వంటి అంశాలపై లెక్కలు తేల్చేందుకు సర్వే చేయాలని నిర్ణయించారు. ఈ వానకాలంలో సుమారు 62 లక్షల ఎకరాల్లో వరివేయగా.. 52 శాతం సన్నాలు, 48 శాతం దొడ్డు రకాలు సాగైనట్టు తెలుస్తున్నది.