జమ్మికుంట, ఏప్రిల్ 10: కరోనా మహమ్మారి మనుషుల్లోని మానవత్వాన్ని మంటగలుపుతున్నది. కరోనా సోకిందన్న కారణంతో ఇంట్లోకి రానివ్వలేదో అద్దె ఇంటి యజమాని. దిక్కుతోచనిస్థితిలో బాధితురా లు రోడ్డు మీదకొచ్చింది. రెండు రోజులుగా తిండి, తిప్పల్లేక ఆర్వోబీ స్లాబ్ కింద తోపుడు బండిపై జీవచ్ఛవంలా ఉండిపోయిన అమానవీయ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో వెలుగుచూసింది. జమ్మికుంట మున్సిపాల్టి పరిధిలోని ఓ కాలనీలో సుశీల(కరోనా బాధితురాలు) కుటుంబంతో కలిసి అద్దెకు ఉంటున్నది. చిరు వ్యాపారం చేసి జీవిస్తున్నది.
నాలుగు రోజుల నుంచి జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఆమె రెండు రోజుల క్రితం పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. కిరాయికి ఉండే ఇంటికి వెళ్లే ప్రయత్నం చేయగా, కరోనా సోకుతుందన్న భయంతో యజమానికి ఇంట్లోకి రానివ్వలేదు. కుటుంబసభ్యులకు తన వల్ల కరోనా వస్తుందేమోనని భావించిన సుశీల చేసేదేమీ లేక ఒక రోజు మార్కెట్ యార్డులో పడుకున్నది. అక్కడి సిబ్బంది పంపించేయడంతో ఆర్వోబీ బ్రిడ్జి కిందకు వచ్చింది. తోపుడు బండి మీద రాత్రంతా పడుకుని ఉన్నది. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, తదితరుల ఆధ్వర్యంలో బాధితురాలిని చికిత్స కోసం కరీంనగర్లోని ఐసొలేషన్ కేంద్రానికి తరలించారు.