కేపీహెచ్బీ కాలనీ, మార్చి 21 : పేదప్రజల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కేపీహెచ్బీ కాలనీలో శిథిలావస్థకు చేరిన ఎల్ఐజీ ప్లాట్స్ పునర్నిర్మాణానికి అనుమతివ్వాలని కోరిన ఎమ్మెల్యే ఆదివారం కేపీహెచ్బీ కాలనీకి చెందిన టీఆర్ఎస్ నేతలు, కాలనీవాసులు మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేపీహెచ్బీ కాలనీ ఎల్ఐజీ ప్లాట్స్లలో కూలీనాలీ చేసుకునే పేద ప్రజలు నివాసముంటున్నారని వారు నివసిస్తున్న ఇండ్లు 40ఏండ్లకు పైబడడంతో శిథిలావస్థకు చేరాయన్నారు. ఈ ప్లాట్లను పునర్నిర్మించుకుంటే కొందరు వ్యక్తులు అడ్డు తగులుతూ పేద ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. అందువల్లే ఈ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పేదలకు న్యాయం జరిగేలా కృషి చేయడం జరుగుతుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ప్రయనిస్తున్నదని దేశంలోనే నంబర్వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా తీర్చిదిద్దబడుతుందని దీనిలో భాగంగానే కూకట్పల్లి నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
ఆరేండ్ల కాలంలోనే ఐదు వేల కోట్లతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు పట్టభద్రులు పట్టంకట్టారని ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, ఓట్లేసిన పట్టభద్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి సేవలందించిన పీవీ నరసింహారావు కూతురు వాణీదేవిని గెలిపించడానికి పనిచేసిన వారందరినీ అభినందించారు. ఎన్నికల్లో గెలిచి శాసనమండలిలో అడుగుపెడుతున్న తొలి మహిళ వాణీదేవికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, కేపీహెచ్బీ కాలనీ డివిజన్ అధ్యక్షుడు మందలపు సాయిబాబా చౌదరి, అడుసుమల్లి వెంకటేశ్వర్రావు, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు జ్యోతి, శ్యామలరాజు, కట్టా నరసింగరావు, పిడికిటి గోపాల్ చౌదరి, సూరిబాబు, సుబ్బరాజు, పున్నారావు, రాము, రాజావెంకట్రావ్, వేణుగోపాల్, రాజేశ్, రాచకొండ భాస్కర్నాయీ, మస్తాన్, అనూరాధ తదితరులు ఉన్నారు.