హైదరాబాద్/ములుగు, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప ఆలయ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం రూ.250 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ కృషి ఫలితంగా రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఆలయం వరకు త్వరలో డబుల్లైన్ రోడ్డు, సెంట్రల్లైటింగ్ ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పా రు. తెలంగాణకు రామప్ప ఆలయం గర్వకారణమన్నారు. మంత్రులు మంగళవారం ఆలయాన్ని దర్శించి పూజలు చేసి, ఆవరణలో మొక్కలు నాటారు. వీరి వెంట వినోద్కుమార్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత తదితరులున్నారు.
సమైక్య పాలనలో తెలంగాణ గుడులపై వివక్ష
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు తెలంగాణలోని దేవాలయాలను నిర్లక్ష్యం చేశారని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. రామప్పను కట్టించింది కాకతీయ రాజులైతే, స్వరాష్ట్రం వచ్చాక ఆలయ ఘనతను నలుదిశలా చాటి యునెస్కొ గుర్తింపు తెచ్చింది సీఎం కేసీఆర్ అని తెలిపారు. రాష్ట్రంలోని మరిన్ని చారిత్రక ప్రదేశాలకు గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. రామప్పతోపాటు సమాంతర దేవాలయాలను అభివృద్ధి చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాను గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. పర్యాటకుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి యాదాద్రి- భువనగిరి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను కలుపుతూ కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్ను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. తమ శాఖ నుంచి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఇప్పటికే రామప్పకు దేశ విదేశీ పర్యాటకులు, భక్తులు వస్తున్నారని, యునెస్కో గుర్తింపుతో వారి సంఖ్య లక్షల్లో ఉంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
ఉమ్మడి ఏపీలో తెలంగాణ చరిత్రను వెలుగులోకి రానివ్వకుండా సమైక్య పాలకులు అడ్డుకొన్నారని, మరుగున పడ్డ చరిత్రను స్వరాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం వెలుగులోకి తేవటం ద్వారా నే యునెస్కో రామప్పను గుర్తించిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. కాకతీయ శిల్ప సంపదను భవిష్యత్తు తరాలకు అందించేందుకు అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇక్కడి ప్రజలకు మంచి ఉపాధి దక్కే అవకాశాలున్నాయని చెప్పారు. ఆలయ అభివృద్ధిపై నివేదిక రూపొందించి సీఎం కేసీఆర్కు అందజేసి ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం ఈ ప్రాంత ఎంపీగా తనకు ఎంతో గర్వకారణమని మాలోతు కవిత అన్నారు.