హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2026 తర్వాత మాత్రమే జరగనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. 2026లో జనాభా లెక్కలు ప్రచురించబడిన తర్వాత ప్రతి రాష్ట్ర అసెంబ్లీలోని సీట్ల సంఖ్య సర్ధుబాటు చేయబడుతుందని పేర్కొంది. జమ్ముకశ్మీర్తో పాటు తెలంగాణలో నియోజకవర్గాలను ఒకేసారి పునర్విభజన చేసేందుకు కేంద్రం ఏమైనా ఆలోచిస్తుందా అన్న మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానమిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ఇంటర్-అలియా సెక్షన్ 26 (1) ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో ఉన్న నిబంధనలకు లోబడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాల సంఖ్య 175 నుంచి 225కి అదేవిధంగా తెలంగాణ శాసనసభ స్థానాల సంఖ్య 119 నుండి 153 కి పెంచాలి. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ దేశంలోని మిగతా రాష్ట్రాలతో పాటు 2026 తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోని నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి కేంద్రం ఆసక్తిగా ఉందన్నారు. దీని ప్రకారం నూతన నియోజకవర్గాలు 2031కి ముందు ఉనికిలోకి వచ్చే అవకాశం లేదు.