ఏడు సెంటర్లు… లక్షా 30 వేల క్వింటాళ్లు సేకరణ
ఆదర్శం చొప్పదండి సహకార సంఘం
చొప్పదండి, మే 27: మండలంలోని చొప్పదండి సహకార సంఘం యాసంగిలో లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టి ఆదర్శంగా నిలిచింది. సహకార సంఘం ఆధ్వర్యంలో ఏడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, లక్ష క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం నిర్దేశించారు. కాగా, గురువారం వరకు లక్షా 30 వేల క్వింటాళ్ల ధాన్యం సేకరించినట్లు అధికారులు తెలిపారు. ముందస్తుగా ఊహించిన దాని కంటే 30 వేల క్వింటాళ్ల ధాన్యం అధికంగా వచ్చినప్పటికీ రైతులకు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, మిల్లర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహకార సంఘం చైర్మన్ వెల్మ మల్లారెడ్డి ఆదేశాల మేరకు సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు రైతుల నుంచి లక్షా 30 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా, 95 వేల క్వింటాళ్ల ధాన్యం డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. మిగితా డబ్బులు మూడు, నాలుగు రోజుల్లో జమ చేస్తామని అధికారులు వెల్లడించారు.
వారం రోజుల్లో డబ్బులు జమ
సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏడు కొనుగోలు కేంద్రాలను చైర్మన్ వెల్మ మల్లారెడ్డి నిత్యం పర్యవేక్షిస్తూ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేశారు. కేంద్రాల్లో రైతులకు తాగునీరు, నీడ, టార్పాలిన్లు, శానిటైజర్లు, గన్నీ సంచులు అందుబాటులో ఉంచడంతో పాటు హమాలీలు, రైతుల సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలిస్తున్నారు. ధాన్యం రవాణాలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ధాన్యం తూకం పూర్తయిన రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి, వారంరోజుల్లోపు డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.