హైదరాబాద్ : ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే కేసులో అభియోగాలు ఎదుర్కొనే తండ్రి ఆస్తులతోపాటు కొడుకు స్వార్జిత ఆస్తులను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) సీజ్ చేయడాన్ని రాష్ట్ర హైకోర్టు ఆక్షేపించింది. కొండాపూర్లో సీజ్ చేసిన ఫ్లాట్ను కుమారుడికి అప్పగించాలని ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి ఏసీబీని ఆదేశించారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తూ సంపాదించిన డబ్బు రూ.53 లక్షలతో కొండాపూర్లో ఫ్లాట్ కొనుగోలుచేస్తే.. తన తండ్రి కేసులో ఏసీబీ అన్యాయంగా సీజ్ చేసిందని కొడుకు వి.ఆదిత్య హైకోర్టును ఆశ్రయించారు. తన తండ్రి వి. వరప్రసాద్ సంగారెడ్డి జిల్లాలో అదనపు జడ్జిగా పనిచేస్తుండగా.. ఆదాయానికి మించి ఆస్తులను కూడగట్టారనే అభియోగాలతో కుటుంబానికి చెందిన రూ.1.28 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ సీజ్ చేసిందని ఆదిత్య హైకోర్టుకు వివరించారు. తన కష్టార్జితంతో కొన్న ఫ్లాట్ను ఏసీబీ సీజ్ చేయడం అన్యాయమని దరఖాస్తు చేసుకుంటే ఈ వ్యవహారాన్ని విచారణలో తేల్చుతామని ఏసీబీ కోర్టు పేర్కొనడాన్ని కొట్టివేయాలని హైకోర్టును కోరారు. అమెరికాలో ఉద్యోగం చేస్తూ హైదరాబాద్లోని బ్యాంకుకు పంపిన డబ్బుల లావాదేవీల వివరాలను పరిశీలించిన హైకోర్టు ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దుచేసింది. ఫ్లాట్ కొనుగోలుకు తన తండ్రి ఏ విధమైన ఆర్థికసాయం చేయలేదనే వాదనలకు అనుగుణంగా పిటిషనర్ సమర్పించిన పత్రాలను హైకోర్టు పరిశీలించి ఫ్లాట్ సీజ్ చేయడం చెల్లదని ఉత్తర్వులు జారీచేసింది.