కొనియాడిన ప్రజాప్రతినిధులు
జనగామలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు
ముఖ్యమంత్రికి చిందు కళాకారుల కృతజ్ఞతలు
జాతీయ రహదారిపై క్షీరాభిషేకం
ప్రభుత్వ పథకాలపై యక్షగానం..
జనగామ, జూలై 1 (నమస్తే తెలంగాణ) : దళితుల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం దళిత క్రాం తి పథకాన్ని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి గురువారం పాలాభిషేకం చేశారు. మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్లు పోకల జమున, బాల్దె విజయ, మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు బండ పద్మ, జూకంటి లక్ష్మి శ్రీశైలం, గుర్రం భూలక్ష్మి, టీఆర్ఎస్ దళిత నాయకులు పసుల ఏబెల్, గద్దల నర్సింగరావు, రావెల రవి, లెనిన్, లాజర్, గుర్రం నాగరాజు, పంతుల ప్రభాకర్రావు తదితరులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్, మార్కెట్ చైర్ పర్సన్లు మాట్లాడుతూ.. మునుపెన్నడూ ఏ ప్రభుత్వాలు తీసుకోని విధంగా చారిత్రక, సాహసోపేత నిర్ణయం తీసుకుని దళితుల బతుకుల్లో కేసీఆర్ వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. బంగారు తెలంగాణను సాకారం చేస్తున్న కేసీఆర్ నాయకత్వం లో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు అదృష్టవంతులన్నారు. ‘అందరి కష్టాలు తెలిసిన మనసున్న మారాజు మా కేసీఆర్’ అంటూ నినదించారు.
యక్షగానంతో అభిమానం
దేవరుప్పుల : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత క్రాంతి పథకం దళితుల్లో సంక్రాంతిని నింపనుందని రాష్ట్ర హంస అవార్డు గ్రహీత, చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య అన్నారు. మండలంలోని అప్పిరెడ్డిపల్లికి చెందిన చిందు యక్షగాన కళాకారులు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై సీఎం కేసీఆర్ చిత్రపటానికి గురువారం క్షీరాభిషేకం చేసి ఘనంగా కీర్తించారు. ఇక్కడ సమ్మయ్య మాట్లాడుతూ దళిత క్రాంతి దేశంలోనే కనీవినీ ఎరుగని పథకమన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం అందించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపడం సామాన్య విషయం కాదన్నారు. ఏ దళిత కుటుంబమైనా సామాజిక, ఆర్థిక వివక్షకు గురికావద్దనే సీఎం కేసీఆర్ సంకల్పం అత్యున్నతమైనదని పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ పథకాలైన కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, ఆసరా, కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులు, ఉచిత కరంటుపై యక్షగానం రూపంలో ప్రజలకు అర్థమయ్యేలా తెలిపి ఆకట్టుకున్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు తమకు నచ్చి స్వచ్ఛందంగా ప్రదర్శన ఇచ్చామని, దళిత జాతి సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కళాకారులు గడ్డం సోమరాజ్, గడ్డం రఘుపతి, రాసాల ప్రభాకర్, గడ్డం యాదగిరి, గడ్డం శ్రీపతి, గడ్డం ప్రజాపతి, చింతల చెరువు వెంకన్న పాల్గొన్నారు.