న్యూఢిల్లీ, ఆగస్టు 11: ‘రాష్ర్టాలు పరిమితికి మించి అప్పులు చేస్తున్నాయి.. ఇలా అయితే భారత్ పరిస్థితి కూడా శ్రీలంక మాదిరిగా తయారవటం ఖాయం’.. ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ చేసిన హెచ్చరిక ఇది. కానీ, కేంద్రప్రభుత్వమే భారత్ను అప్పుల కుప్పగా మార్చిందని, మన దేశ అప్పులు గాలి బుడగలా పెరిగిపోయాయని, ఆ బుడగ ఎప్పుడైనా పేలటానికి సిద్ధంగా ఉన్నదంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సంచలన నివేదిక బయటపెట్టింది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అడ్డూ అదుపూ లేకుండా చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే దేశ వార్షిక రాబడిలో 37 శాతం పోతున్నదని తెలిపింది. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం కేంద్రప్రభుత్వం దేశ స్థూల జాతీయోత్పత్తిలో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదని స్పష్టంగా ఉన్నా, మోదీ సర్కారు ఇప్పటికే 54 శాతం అప్పులు చేసిందని తలంటింది.
పరిస్థితి ఇలాగే పోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉన్నదని పరోక్షంగా హెచ్చరించింది. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2019-20 సంవత్సర కాగ్ నివేదిక మోదీ ప్రభుత్వ నిర్వాకాన్ని, దేశ ఆర్థిక దుస్థితిని కండ్లకు కట్టింది. భారత ఆర్థిక పరిస్థితి అత్యంత విషమ స్థితిలోకి వెళ్తున్నదని కాగ్ హెచ్చరించింది. ప్రభుత్వం చేసిన అప్పులకు ఏటా చెల్లించాల్సిన వడ్డీలు అసాధారణంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. 2021 ఆర్థిక సంవత్సరంలో వడ్డీల రూపంలో రూ.6.80 లక్షల కోట్లు చెల్లించగా, 2022 ఆర్థిక సంవత్సరానికి అది ఏకంగా రూ.8.05 లక్షల కోట్లకు పెరిగిపోయిందని తెలిపింది. దేశ జీడీపీలో అప్పులకు వడ్డీలే 3.1 శాతానికి చేరాయని మోదీ సర్కారును ఏకి పారేసింది.
భారత ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పతనం అధిక వడ్డీ చెల్లింపులు. ఉత్పాదకత రంగానికి ఖర్చు చేయాల్సిన సొమ్మంతా వడ్డీలు చెల్లించటానికే సరిపోతున్నది. 2014-15లో జీడీపీలో వడ్డీ చెల్లింపుల వాటా 2.5% ఉండగా, ప్రస్తుతం 3.1శాతానికి పెరిగింది.
– దెబోపమ్ చౌదరి, ట్రూబోర్డ్ పార్టనర్స్ ప్రధాన ఆర్థికవేత్త.