తెలంగాణలో ఒకప్పుడు తాగునీటి గోస అంతాఇంతా కాదు. ఎండాకాలంలోఎలక్షన్కు పోవాలన్నా భయం ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో బిందెల ప్రదర్శన బందైపోయింది. భారీగా ఖర్చు పెట్టి.. పట్టుబట్టి.. నిర్ణీత కాలవ్యవధి పెట్టుకొని మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సమస్యకు అంతం పలికినం. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి 100% తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సాక్షాత్తూ కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పార్లమెంటులోనే చెప్పారు. ఇది అచీవ్మెంట్ కాదా?
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): దళితవర్గాలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయని, ఏ గ్రామంలోకైనా వెళ్లి.. ఈ ఊళ్లో అత్యంత నిరుపేదలు ఎవరని అడిగితే దళితులనే చెప్తారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఇది అందరూ సిగ్గుపడాల్సిన, బాధపడాల్సిన అంశమని ఆవేదన వ్యక్తంచేశారు. దాన్ని సరిచేయాలనే సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంను తీసుకున్నామని తెలిపారు. గతంలో మాదిరిగా పేదల భూములను పెద్ద గద్దలు తన్నుకుపోవద్దనే ఉద్దేశంతో అసైన్డ్ భూముల చట్టంతెచ్చారన్న సీఎం.. మారిన పరిస్థితుల్లో అసైనీలకు పూర్తి హక్కులు ఎందుకివ్వకూడదని సందేహం వ్యక్తంచేశారు. ఈ అంశంపై దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలతో చర్చించి, అవసరమైతే చట్టంలో మార్పులు తీసుకొస్తామన్నారు. శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు సీఎం సమాధానం ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..
ఇదో గౌరవప్రదమైన ప్రారంభం
దళితవర్గాలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయి. ఏ గ్రామమంలోకైనా వెళ్లి.. ఈ ఊళ్లో అత్యంత నిరుపేదలు ఎవరని అడిగితే దళితులనే చెప్తారు. ఇది అందరూ సిగ్గుపడాల్సిన, బాధపడాల్సిన అంశం. దాన్ని సరిచేయాలి. నేను ఈసారి దళితవర్గం శాసనసభ్యులతో, ఆ శాఖ మంత్రితోచర్చించిన తర్వాత ఒక ప్రతిపాదన చేశా. ఒక గౌరవప్రదమైన ప్రారంభం మనం చేద్దాం.. విజయవంతమైతే వచ్చే ఏడాది నుంచి మరింత పెచుకుంటూ పోదాం.. అని ఎస్సీ సబ్ప్లాన్కు పైన మరో రూ.వెయ్యి కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగాం పెట్టాం. అది సబ్ప్లాన్లో భాగం కాకుండా అదనం అని సభకు నేను మరోసారి స్పష్టతనిస్తున్నా. ఈ నిధులను నియోజకవర్గానికి రూ.10 నుంచి రూ.15 కోట్ల చొప్పున ఇచ్చి కనీసం కొన్ని కుటుంబాలనైనా బాగుచేయాలన్న ఆలోచనతో ప్రారంభించాం. ఈ నిధులతో ఏయే కార్యక్రమాలు చేపట్టాలనే విషయంలో పార్టీలకు అతీతంగా దళిత ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చిస్తా. సమావేశానికి భట్టి విక్రమార్కను కూడా ఆహ్వానిస్తం. అన్ని నియోజకవర్గాలకు వాటిని సమాంతరంగా వాడేలా నిర్ణయాలు తీసుకుంటం.
‘అసైన్డ్’ హక్కులపై అఖిలపక్ష సమావేశం
పెద్ద గద్దలు పేదల భూములను లాక్కోవద్దన్న ఉద్దేశంతో గతంలో అసైన్డ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు అనేక మార్పులు వచ్చాయి. నగరాల పక్కన ఉండే భూముల విలువ పెరిగింది. ప్రైవేట్ భూమి అయితే అమ్ముకొని ఇంకో దగ్గర కొంటున్నరు. అసైన్డ్ భూముల వాళ్లు అమ్ముకోలేకపోతున్నారు. అయినా పెద్ద గద్దలు తన్నుకుపోతూనే ఉన్నాయి. వాళ్లకు ఎంతో కొంత డబ్బు ఇచ్చి లేఔట్లు, ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు. అసైన్డ్ భూమి కొన్న వ్యక్తులు కూడా పేదలే అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనిపై అఖిలపక్షం కూర్చొని మాట్లాడుకుందాం. అసైనీస్కు పూర్తి హక్కులు ఎందుకు ఇవ్వకూడదు? అన్న ధర్మసందేహం వస్తున్నది. దీనిపై అందరితో కలిసి చర్చించి, ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. త్వరలోనే దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలతో మాట్లాడుతా. అవసరమైతే చట్టంలో మార్పులు చేద్దాం.
భేద భావాలు ఉండొద్దనే వైకుంఠధామాలు
ప్రతి గ్రామంలో ఇప్పుడు వైకుంఠధామాలు కనిపిస్తున్నాయి. గతంలో ఏవో కొన్ని కులసంఘాలు పెట్టుకున్నవి తప్ప వేరేవి ఉండకపోయేది. నేను మహారాష్ట్రలో పర్యటించినప్పుడు మోహన్దారియా పెట్టిన వన్రాయ్ సొసైటీలోని 300 గ్రామాల్లో ఏకరీతిన ఉన్న వైకుంఠధామాలను చూసి ఇక్కడ కూడా పెట్టినం. కుల, మత, జాతి బేధాలు లేకుండా ఎవరు చనిపోయినా గౌరవప్రదంగా అంత్యక్రియలు చేసుకోవడానికి వైకుంఠధామాలు ఏర్పాటు చేసుకున్నం. గ్రామాల్లో నరేగా నిధులే ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడంలేదన్న ప్రతిపక్షాల ఆరోపణ పూర్తిగా అసత్యం. ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని నిధులు మన రాష్ట్రంలో ఠంచన్గా ప్రతినెలా.. గ్రామాలకు రూ.308 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.148 కోట్లు ఇస్తున్నం. ఏ పద్దు ఆపినా దాన్ని ఆపొద్దని ఆర్థికశాఖ కార్యదర్శిని ఆదేశించిన. కరోనా సమయంలో కూడా వందశాతం ఈ నిధులు ఇస్తున్నం. అందుకే గ్రామాలు పచ్చగా కనిపిస్తున్నయి. పదిశాతం గ్రీన్ బడ్జెట్ కూడా పెట్టాలని ఆదేశాలిచ్చాం. కేంద్రం 15 ఆర్థిక సంఘం నిధుల్లో రూ.690 కోట్లు కోత పెట్టినా మేం ఈ నిధులు ఆపకుండా ఇస్తున్నం.
పోడు సమస్య పరిష్కారానికి ప్రజాదర్బార్
పోడుభూముల విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని అటవీశాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలిచ్చాను. నా కార్యాలయంలో పనిచేసే సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి భూపాల్రెడ్డి, మరో అధికారి ప్రియాంకవర్గీస్కు స్టేటస్కో మెయింటెన్ చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చాం. కొద్ది రోజుల్లో ప్రభుత్వమే బయల్దేరుతుంది. గవర్నమెంట్ ఎక్కడో కూర్చుని రహస్యంగాచేయడం నాకు ఇష్టం లేదు. బాజాప్తా ప్రజాదర్బార్ పెట్టి అసలు పోడు భూములు ఏంది? వాటి కథేంది? అనేది ఆలోచన చేస్తం. వీలైనంత త్వరగా గిరిజనులకు ఆ భూములపై హక్కులు కల్పిస్తం. రైతుబంధు ప్రారంభించినప్పుడు ఆర్వోఎఫ్ఆర్ గమనంలోకి తీసుకోలే. తర్వాత మా ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు వాళ్లకు కూడా రైతుబంధు అమలుచేశాం. ఇప్పుడు ఈ పోడు భూముల సమస్యను వందకు వందశాతం చరమగీతం పాడుతం. పోడుభూములు సాగుచేసుకొనే రైతులకు నేను హామీ ఇస్తున్న.. మీ సమస్య పరిష్కరించి ఏదో ఒక రూపంగా పట్టాలు ఇస్తం. మీకు కూడా రైతుబంధు ఇస్తామని మనవి చేస్తున్నా.
డయాగ్నొస్టిక్ సెంటర్లు పెంచుతాం
మహిళా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల బృందాన్ని కేరళకు పంపి అక్కడ ప్రజలకు అందిస్తున్న పౌష్టికాహారంపై వివరాలు సేకరించాం. ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్, కామారెడ్డి, గద్వాల జిల్లాల్లో అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, హెల్త్వర్కర్ల ద్వారా మహిళలు, పిల్లల్లో రక్తహీనత తగ్గింపునకు చర్యలు తీసుకొంటున్నం. బస్తీ దవాఖానలు ఏనాడైనా కలగన్నమా! హైదరాబాద్లో బస్తీ దవాఖానాలు ఢిల్లీలోని మొహల్లా దవాఖానాలకు ప్రతిరూపం. ప్రభుత్వ దవాఖానల్లో ఐసీయూలు, డయాగ్నొస్టిక్ సెంటర్లు పెంచాం.. టిమ్స్లాంటి దవాఖానలను ఆగమేఘాలమీద ఏర్పాటు చేసినం. అయినా సరిపోవు.. ఇంకా పెంచుకుంటం. అదేవిధంగా తలసరి ఆదాయం పెరగాలి. ప్రతి పౌరుడికి కనీస భద్రత ఉండాలి. అందరి ప్రాథమిక అవసరాలు తీరాలన్న భట్టివిక్రమార్క సూచనతో ఏకీభవిస్తున్న. నా ఆలోచన కూడా అదే.
అడవులు 3.6 శాతం వృద్ధి
పోడుభూములను సాగు చేసుకొనే గిరిజనులను కాపాడాలి. అదేసమయంలో అటవీ భూములను రక్షించాలి. అడవులు అంతరించిపోతే చాలా ఇబ్బంది పడతాం. గతంలో రాష్ట్రంలో అద్భుతమైన అటవీ సంపద ఉండె. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి దగ్గర అటవీ ప్రాంతం నుంచి వెళ్లాలంటే పదిపది వాహనాలను కలిపి పంపేవాళ్లు. అంతటి అద్భుత అడవులు ఉండేవి. ఆ అటవీ సంపద కనుమరుగైంది. ఇప్పుడు ఎస్సారెస్పీ నీళ్లతో చుట్టుపక్కల గరక పెరిగితే అందులో వందల జింకలు ఎగురుకుంటూ దుంకుకుంటూ పోతున్న ఫొటోలు ఈ మధ్య పేపర్లలో చూసిన. ఆ దృశ్యాలు ఎంతో బ్రహ్మాండంగా ఉన్నాయి. తెలంగాణలో జీవవైవిధ్యం పెరుగుతున్నదని, అడవులు 3.6 శాతం పెరిగాయని ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వ అటవీవిభాగం అధికారి ఒకరు తెలిపారు.
ధరణి విజయవంతం
గతంలో రెవెన్యూశాఖలో ఒక దుస్సంప్రదాయం కొనసాగింది. భూ రికార్డులన్నీ ఎమ్మార్వోలు, వీఆర్వోల చేతుల్లో ఉండేవి. వాళ్లు రాసిందే రాత.. గీసిందే గీత. అనుభవించడం ప్రజల ఖర్మ. తాసిల్దార్పై ఒకవ్యక్తి పెట్రోల్ పోసి, తనపైనా పోసుకొని కాలబెట్టుకోవడం ఈ అరాచకానికి పరాకాష్ట. భూ రికార్డులపై కఠినంగా ఉండాలని ధరణి ప్రారంభించాం. విజయవంతంగా కొనసాగుతున్నది.
ఆ మాటతో గర్వపడ్డా
తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ కుప్పకూలుతుందని, భూముల ధరలు పడిపోతాయని కొందరు శాపాలు పెట్టిన్రు. ఇప్పుడు అవి వాళ్లకే రివర్స్ తలిగినయి. మన దగ్గర భూముల ధరలు పెరిగితే ఆంధ్రలో తగ్గినయి. ఇక్కడ ఎకరం అమ్మి ఆంధ్రలో రెండు మూడెకరాలు కొంటున్నరని చెప్తున్నరు. ఇది వింటుంటే గర్వంగా అనిపించింది. త్వరలో రాష్ట్రంలోని అన్ని భూములను సర్వేచేస్తాం.
ఇది అభివృద్ధి కాదా?
తెలంగాణలో యాసంగి సీజన్లో ఎన్నడూ 15-20 లక్షల ఎకరాల సాగు దాటలేదు. ఆ 20 లక్షలు కూడా చాలా గగనం. ఈ రోజు తెలంగాణలో యాసంగిలో 65లక్షల ఎకరాలకు పైగా సాగైంది. ఇందులో వరి పంటనే 52 లక్షల ఎకరాల వరకు ఉన్నది. ఇది అభివృద్ధి కాదా? సక్సెస్ కాదా? ఆరేండ్లలో ఇంత పెద్ద మార్పు వచ్చింది.ఎక్కడో తప్ప రాష్ట్రమంతటా చెరువులన్నీ నిండుకుండల్లా ఉన్నయి. రైతులను ఆదుకొనేందుకు చెరువులను నింపడమే కాదు.. వాగుల్లోనూ గోదావరి జలాలను వదిలిపెడుతున్నం. కనీవినీ ఎరుగని పరిస్థితి ఇది. రైతులంతా సంతోషంగా ఉన్నరు. తెలంగాణలో కచ్చితంగా వ్యవసాయాన్ని పండుగ చేసినం. రైతుల్లో ధీమా వచ్చింది.ఆత్మవిశ్వాసం పెరిగింది.
-అసెంబ్లీలో సీఎం కేసీఆర్