కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆదేశం
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పది రోజుల్లోగా వలస కార్మికుల డాటాను సేకరించాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో కలిసి శనివారం బీఆర్కే భవన్లో కార్మికశాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. వలస కార్మికుల సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి ప్రయోజనాలను అందించడానికి ఒక విధానాన్ని రూపొందించడానికి ఫార్మా, టెక్స్టైల్స్, రైస్మిల్స్, కన్స్ట్రక్షన్ సంస్థల నుంచి డాటా సేకరించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. సమీక్షలో కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్కుమార్, కార్మికశాఖ కార్యదర్శి అహ్మద్ నదీమ్ తదితరులు పాల్గొన్నారు.