హైదరాబాద్/సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇచ్చే దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం.. 2021 సంవత్సరానికి తెలుగు వర్సిటీ మాజీ వీసీ, సాహితీవేత్త డాక్టర్ ఎల్లూరి శివారెడ్డికి ప్రకటించింది పురస్కార గ్రహీతను సీఎం కేసీఆర్ ఎంపికచేశారని సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డును గురువారం మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రదానంచేస్తారు. ఈ అవార్డు కింద సైటేషన్తోపాటు రూ.1,01,116 నగదును అందజేస్తారు. మహాకవి దాశరథి సేవలను చిరస్మరణీయంచేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సాహిత్యరంగంలో విశేషంగా కృషిచేసిన వారికి ప్రతిఏటా దాశరథి జయంతి అయిన జూలై 22న అవార్డు ఇస్తున్నది.
సాహితీ సేవలో ఎల్లూరి శివారెడ్డి
దాశరథి సాహితీ పురస్కారానికి ఎంపికైన డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి పండితుడు, విమర్శకుడు, కవి. తెలుగు వర్సిటీ వీసీగా పనిచేశారు. ఉస్మానియా తెలుగు శాఖలో ఎంఏ విద్యార్థులకు ప్రాచీన సాహిత్యాన్ని బోధించడంలో ఆయనది విశిష్టమైన ముద్ర. అనేక ప్రత్యేక సంచికల సంపాదకుడుగా సాహిత్యరంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆంధ్రమహాభారతంలో రసపోషణం అన్న అంశంపై శివారెడ్డి తన పీహెచ్డీ పరిశోధన చేశారు. శివారెడ్డి నాగర్కర్నూలు జిల్లా వీపనగండ్ల మండలం కొల్లూరులో 1945 ఏప్రిల్ 7న జన్మించారు. ఉస్మానియా వర్సిటీ తెలుగుశాఖలో ఆచార్యులుగా, పాఠ్యాంశ నిర్ణాయక మండలి అధ్యక్షుడుగా, రెండుసార్లు శాఖాధ్యక్షులుగా, పర్యవేక్షకులుగా, ప్రతిష్ఠాత్మకమైన సదస్సుల సంచాలకులుగా సేవలందించి తెలుగుశాఖకు ప్రాధాన్యం తెచ్చారు. సినిమా నంది అవార్డుల కమిటీ సభ్యులుగా, సురవరం ప్రతాపరెడ్డి సాహితీ వైజయంతి ట్రస్ట్ చైర్మన్గా వ్యవహరిస్తున్న శివారెడ్డి పలు సాహితీ, సాంస్కృతిక సంస్థల ద్వారా విస్తృతంగా సేవలందిస్తున్నారు. నాటి ఆంధ్ర సారస్వత పరిషత్తు.. నేటి తెలంగాణ సారస్వత పరిషత్తుకు అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.