హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ గుబులు పుట్టిస్తున్నది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్టు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్డీపీఎస్) తెలిపింది. తుఫాన్ ప్రభావంతో సోమ, మంగళవారాల్లో అత్యంత భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తుఫాన్ ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉన్నదని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. తుఫాన్ ఆగ్నేయదిశగా గోపాలపూర్కు 100 కిలోమీటర్లు, ఈశాన్యదిశగా కళింగపట్నానికి 105 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై, గంటకు 24 కిలోమీటర్ల వేగంతో పశ్చిమదిశగా కదిలింది. ఆదివారం రాత్రి 9 గంటల తర్వాత ఒడిశాలోని గోపాల్పూర్, ఏపీలోని కళింగపట్నం మధ్య తీరం దాటే ప్రక్రియ మొదలైంది. తీరం దాటేందుకు 3 గంటల సమయం పడుతుందని ఐఎండీ వెల్లడించింది. ఈ సమయంలో గంటకు 75 నుంచి 85 కిలోమీటర్లు, ఒక్కోసారి 95 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నది. మరోవైపు, ఈశాన్య, తూ ర్పు మధ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో 24 గంటల్లో ఈశా న్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడొచ్చని పేర్కొన్నది.
భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు
నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లో సోమవారం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జనగామ, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురువొచ్చని పేర్కొన్నది. ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై, అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మామకన్నులో 12.43 సెం.మీ., రంగారెడ్డి జిల్లా మణికొండలో 10.93 సెం.మీ., సంగారెడ్డిలో 9.10 సెం.మీ., హైదరాబాద్లోని షేక్పేటలో 8.90 సెం.మీ., ఫిల్మ్నగర్లో 8.55 సెం.మీ., నల్లగొండ జిల్లా గుర్రంపోడులో 8.48 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
ప్రతి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్: సీఎస్
గులాబ్ తుఫాన్ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. సీఎం కేసీఆర్తో కలిసి ఢిల్లీ వెళ్లిన సోమేశ్కుమార్ అకడనుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్అలర్ట్, దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్గా ప్రకటించినట్టు తెలిపారు. పోలీస్, ఇతర విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, తెగే అవకాశం ఉన్న చెరువులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ సేవలను తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం వరంగల్, హైదరాబాద్, కొత్తగూడెంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వరద ప్రవాహ సమయంలో వాగులు, వంకలు దాటకుండా నిఘా ఉంచాలని సూచించారు.
ఏపీ సీఎం జగన్కు ప్రధాని మోదీ ఫోన్
గులాబ్ తుఫాన్ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరా తీశారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డితో ఫోన్లో మాట్లా డి వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం నుంచి ఏ సాయం కావాలన్నా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
తుఫానులో ఒక్కరు కూడా చనిపోవద్దు
భువనేశ్వర్, సెప్టెంబర్ 26: గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోవద్దని ఒడిశా ప్రభుత్వం లక్ష్యం గా పెట్టుకొన్నది. అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం నవీన్పట్నాయక్ అధికారులను ఆదేశించారు. వరదముప్పు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నచోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు.