హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లకు వెంటనే మరమ్మతు చేయాలని ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం బంజారాహిల్స్ మంత్రుల నివాస ప్రాంగణంలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలపై ఆ శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, పీఆర్ ఇంజినీరింగ్ విభాగం ఈఎన్సీ సంజీవరావుతో సమీక్ష నిర్వహించారు. వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లకు మరమ్మతులు చేయాలని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తిచేయాలని, ప్రజల రవాణా సౌకర్యానికి ఎలాంటి ఇబ్బందులు రానివొద్దని సూచించారు. పంచాయతీరాజ్శాఖలో ఇప్పటికే పదోన్నతులు పొందిన 57 మందికి వెంటనే పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించారు. కారోబార్, పంప్ మెకానిక్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిశీలించి, నిబంధనల మేరకు వెంటనే పరిష్కరించాలని చెప్పారు. ఇంకా పూర్తి కాని వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని స్పష్టంచేశారు.