నల్లగొండ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ వృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని బొమ్మలారామారంలో గల పీఏసీఎస్ ధాన్యం సేకరణ కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయానికి గత వైభవాన్ని తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైందన్నారు. రైతులు సాగు ద్వారా లాభాలు పొందేలా చూశారన్నారు.
సీఎం రైతు అనుకూల కార్యక్రమాలతో ఇది సాధ్యపడిందన్నారు. పెట్టుబడి సాయం, రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా, నీటిపారుదల సదుపాయాన్ని పెంచడం ఇలా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. చివరి ధాన్యపు గింజ కొనేవరకు సేకరణ కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతాయన్నారు. అంతేకాకుండా ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న ధాన్యాన్ని సైతం రైతుల నుంచి కొనుగోలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.