16న శాలపల్లి -ఇందిరానగర్కు ముఖ్యమంత్రి కేసీఆర్
దగా పడిన దళితజాతికి ఆత్మబంధువులా ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రాబోతున్నారు. దశాదిశా మార్చే దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. విప్లవాత్మక రైతు బంధును ప్రారంభించిన శాలపల్లి- ఇందిరానగర్ వేదికగానే సోమవారం మధ్యాహ్నం 2గంటలకు చారిత్రక పథకానికి అంకురార్పణ చేయబోతున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. జర్మనీ హంగర్ టెక్నాలజీతో సభను నిర్మించడంతోపాటు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అంతా సిద్ధం చేస్తున్నారు. ప్రధాన డయాస్తో పాటు కళాకారులకు ప్రత్యేకంగా మరో డయాస్ రెడీ చేస్తున్నారు. 3500 మంది పోలీసులతో భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. -కరీంనగర్,(నమస్తే తెలంగాణ)
చారిత్రక దళిత బంధుకు వేళయింది. శాలపల్లి- ఇందిరానగర్ వేదికగా సోమవారం మధ్యాహ్నం 2గంటలకు పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టబోతుండగా, యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తున్నది. పథకం అమలుకు సీఎం కేసీఆర్ తనకు అత్యంత ఇష్టమైన కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గాన్నే ఎంచుకున్నారు. పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే 500 కోట్లు విడుదల చేసిన సీఎం కేసీఆర్ సోమవారం లాంఛనంగా పథకానికి శ్రీకారం చుడుతున్నారు. అత్యంత జనాదరణ పొందుతున్న రైతు బంధును ప్రారంభించిన, హుజూరాబాద్ మండలం శాలపల్లి- ఇందిరానగర్ గ్రామాన్నే మరోసారి దళిత బంధు ఆవిష్కరణకు వేదిక చేశారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 20,929 దళిత కుటుంబాలు ఉన్నాయి. ఇందులో అర్హులైన ప్రతి కుటుంబానికి దళిత బంధు అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో సర్వే కూడా చేశారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో సభ లు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అధికారులు చెబుతున్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు..
దళిత బంధు పథకం ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ వస్తుండగా, అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్తో పాటు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పర్యవేక్షణలో ఏర్పాట్లు దాదాపు పూర్తి కావస్తున్నాయి. సీఎం కేసీఆర్ హెలీకాప్టర్లో వస్తున్నందున ఆదివారం హెలీకాప్టర్ ట్రయల్ కూడా పూర్తయింది. సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి దాదాపు 1.20 లక్షల మంది దళితులు, టీఆర్ఎస్ శ్రేణులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో 30 ఎకరాల్లో సభా స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 200 మంది కూర్చునేందుకు వీలుగా వేదికను తీర్చిదిద్దుతున్నారు.
సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ పాసులు, కొవిడ్ నిబంధనల మేరకు మాస్కులు కూడా ఇవ్వనున్నారు. జనాలు సభకు వచ్చేందుకు 825 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. బస్సులే కాకుండా ఇతర వాహనాలు కూడా భారీ గా తరలి రానుండగా, రెండు ప్రాంతాల్లో 14 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ మార్గంలో వచ్చే వాహనాలకు సాయి డెవలపర్స్ ప్రాంతంలో ఎస్సారెస్పీ కాలువ దాటిన తర్వాత 4చోట్ల, ఇక జమ్మికుంట మార్గంలో వచ్చే వాహనాలకు లిడ్ క్యాప్ స్థలం వద్ద అయ్యప్ప ఆలయం వెనక, బాలాజీ బ్రిక్స్ కంపెనీ ప్రాంతంలో మరో 10 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.