తిరుమలగిరి: దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళితుల సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పధకం ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడని మాజీ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ మందుల సామేల్ అన్నా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమలగిరి మండలాన్ని దళితబంధు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం తిరుమలగిరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతోనే తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి దళితబంధుకు ఎంపికైందని అన్నారు. గత ప్రభుత్వాలు దళితుల సంక్షేమం కోసం ఏనాడు అలోచించలేదన్నారు. కొందరు అనాలోచితంగా ఓట్ల కోసమే దళితబంధు పెట్టారని ఆరోపించటం అర్ధరహితమని అన్నారు.
ఓట్ల కోసమే అయితే రాష్ట్రంలోని నాలుగు వైపులా ఎస్సీ నియోజక వర్గాల్లోని మండలాలను ఎందుకు ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. ముఖ్య మంత్రి కేసీఆర్ చిత్తశుద్ధి కలిగిన మహా నాయకుడని, ఆయన తలుచుకుంటే ఏ పథకాన్నైనా ప్రజలకు అందించి తీరుతారని అన్నారు. రైతుబంధు, రైతుభీమా ఎవరు అడిగారని ఇచ్చారన్నారు. అన్నదాతల కండ్లలో ఆనందం చూడాలని ఆయన ఆయా పథకాలను అమలు చేస్తున్నారన్నారు.
కాళే శ్వరం ప్రాజెక్టు కట్టించి ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సాగునీరు అందించటం వళ్లే కరువు నేలైనా తుంగతుర్తి నియోజ కవర్గంలో లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందుతుందన్నారు. ప్రజారంజక పాలన అందించే దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శాగంటి యాదగిరి, శ్రీను ,రామాచారి, సతీశ్, దేవేందర్, మత్తయ్య, వెంకన్న, సోమయ్య, రాజు, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.