చరిత్రాత్మక దళిత బంధు పథకంపై దళిత సమాజం దరువేసింది. దళితుల జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మేధావులతో సుదీర్ఘంగా చర్చించి రూపొందించిన పథకం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ ఎంపిక కావడంతో నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, కమలాపూర్ మండలాల్లో సంబురాలు అంబరాన్ని అంటాయి. జమ్మికుంటలో దళితులు, టీఆర్ఎస్ శ్రేణులు సుమారు 4 వేల మందితో డప్పు వాయిద్యాలు, కోలాటాలు, కళాకారుల విన్యాసాల నడుమ భారీ ర్యాలీ నిర్వహించారు. ఇల్లందకుంటలో రెండు కిలోమీటర్ల మేర జులూస్ తీశారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఊరూరా, దళితవాడల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్: దళిత సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. దళితుల జీవితాల్లో వెలుగులు నింపే చరిత్మ్రాక పథకాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, దళిత మేధావులు క్షీరాభిషేకాలు చేశారు. దేశంలో ఇప్పటి దాకా పాలకులు దళితులను కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే చూశారని, అదే సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో దళితవర్గాల అభ్యన్నతే ధ్యేయంగా ఈ పథకాన్ని తీసుకురావడం మేలిమలుపుగా రాజకీయ, సామాజిక విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా సంబురాలు అంబరాన్ని అంటాయి. రైతాంగానికి భరోసా ఇచ్చేలా తీసుకొచ్చిన రైతుబంధు పథకాన్ని ప్రారంభించి విజయపథంలో నిలబెట్టిన హుజూరాబాద్ నియోజకర్గమే దళిత బంధు అమలుకు వేదికగా మారడంతో ఈ పథకం దేశసంక్షేమ చిత్రపటానికి దిక్చూచిగా ఉంటుందని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దళిత బంధు ప్రకటనతో ఊరూరా దండోరా మోగింది. తమ జీవితాల్లో శాశ్వత వెలుగురేఖలు నింపుతాయనే ధీమాను దళితులు దరువేసి పంచుకున్నారు. పార్టీలకు అతీతంగా సీఎం కేసీఆర్కు అన్ని వర్గాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ముందుచూపుతో ఈ పథకంలో మూడు ముఖ్యమైన అంశాలపై లోతైన విశ్లేషణ, అవగాహనతో కొనసాగిస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ పేర్కొనడం గొప్ప విషయంగా దళిత మేధావులు పేర్కొంటున్నారు.
పైలట్ ప్రాజెక్టుపై సంబురం
ఈ పథకం రాష్ట్రంలో అమలు చేసే పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంబురాలు మిన్నంటాయి. నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, కమలాపూర్ మండలాల్లో ఎక్కడ చూసినా దళితులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తన రోడ్లపైకి వచ్చి పటాకులు కాల్చారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, ఒగ్గు డోలు కళాకారులతో ర్యాలీలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాలకు, సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలతో రెండు కిలోమీటర్ల మేర ర్యాలీ తీశారు. నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాలు, దళితవాడల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. ముఖ్యంగా యువకులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు దళిత కాలనీల్లో స్వచ్ఛందంగా క్షీరాభిషేకాలు నిర్వహించారు.
నిజమవుతున్న అంబేద్కర్ కల : మంత్రి గంగుల
కరీంనగర్, జూలై 19 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో నిర్వహించిన దళిత బంధు సంబురాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గంగులతో కలిసి హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్కుమార్, కరీంనగర్ మేయర్ వై సునీల్రావు, హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన నివాళి అర్పించారు. అనంతరం డప్పు కొట్టి దరువేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి పురుడు పోశారని అన్నారు. ఈ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను సీఎం కేసీఆర్ ఎంతో ప్రోత్సహించారని, దీనిని ఆసరా చేసుకుని ఆయన సీఎం పీఠంపైనే కన్నేశారని ధ్వజమెత్తారు.
దళిత జీవితాల్లో వెలుగులు
మంత్రి కొప్పుల ఈశ్వర్
జమ్మికుంట, జూలై19: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న దళితబంధు దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దళిత బంధు పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో సోమవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ హాజరయ్యారు. పట్టణంలోని మోత్కులగూడెం చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. 5వేల మందితో డప్పు, డోలు చప్పుళ్ల మధ్య స్థానిక తెలంగాణచౌక్ వరకు భారీర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పథకాన్ని హుజూరాబాద్ నుంచే ప్రారంభిస్తానని చెప్పడం అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మమత, జడ్పీటీసీ శ్యాం, దళిత నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇల్లందకుంటలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ తదితరుల ఆధ్వర్యంలో దళిత సంఘాలు సంబురాలు చేసుకొన్నాయి.
సీఎం సాహసోపేత నిర్ణయం
దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలోని ఎస్సీ కులాల సమగ్ర అభివృద్ధికి దళిత బంధు పథకం అమలుచేయాలని సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం చరిత్రలో గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది. దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన నేతగా కేసీఆర్ను తరతరాలు గుర్తుంచుకుంటారు.
మన పథకాలు దేశానికే ఆదర్శం
మన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం. దళిత బంధు పథకం ద్వారా దళితులకు న్యాయం జరుగుతుంది. దళితులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలి.
సాధికారతే లక్ష్యం
దళిత బంధు పథకం దళితులలో కొత్త వెలుగు నింపుతుంది. నిరుపేద దళితులు సాధికారత సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దీనిని చేపట్టారు. హుజురాబాద్లో ఈ పథకాన్ని ప్రారంభించడం శుభసూచకం. బ్యాంకులతో సంబంధం లేకుండా, మధ్యవర్తులు, బ్రోకర్లు లేకుండా నేరుగా లబ్ధిదారుని ఖాతాలో సొమ్ము జమ చేయడం గొప్ప విషయం. రాష్ట్రంలోని దళితుల పక్షాన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
దళితులకు మంచి రోజులు
దళితులకు మంచి రోజులు మొదలవుతున్నాయి. ఈ పథకం ఆర్థిక సాధికారతతోపాటు దళితుల ఆత్మైస్థెర్యాన్ని పెంచుతుంది. తరతరాల పేదరికం దూరమవుతుంది. దళితుల కోసం తపించేది కేసీఆర్ ఒక్కరే.
జీవితాలను మార్చే పథకం
దళిత బంధు పథకం ద్వారా రాష్ట్రంలోని దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. సీఎం కేసీఆర్ గొప్ప లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. గతంలో ఎవరూ దళితులను పెద్దగా పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్కు రాష్ట్రంలో దళితుల స్థితిగతులు తెలిసే పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. అఖిలపక్షం సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించారు. రూ.1200 కోట్లతో మొదటగా పథకాన్ని అమలు చేసేవిధంగా ‘తెలంగాణ దళిత బంధు’ పేరు నామకరణం చేయడం హర్షణీయం. ఈ పథకం వారి జీవితాల్లో మార్పు తెస్తుంది.
దళిత జనోద్ధరణ ప్రదాత సీఎం కేసీఆర్
దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి దేశ చరిత్రలో దళిత జనోద్ధరణ ప్రదాతగా సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారు. సమాజంలో ఊరికి ఆవల విసిరేయబడిన ఇండ్లను తన కళ్లతో దర్శించి, వారి జీవితాలకు శాశ్వత వెలుగులు నింపుతున్న మహనీయులు సీఎం కేసీఆర్. దళిత బంధు పథకాన్ని తెచ్చి దేశ సంక్షేమ రంగ దశ, దిశను మార్చే గొప్ప నేత సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.
చరిత్రాత్మక పథకం
దళిత బంధు చరిత్రాత్మక పథకం. ఇది దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదం చేస్తుంది. సీఎం కేసీఆర్కు దళిత జాతి రుణపడి ఉంటుంది.
సంక్షేమ పథకాల్లో మైలురాయి
దేశ సంక్షేమ పథకాల్లో దళిత బంధు మైలురాయిగా నిలిచిపోతుంది. ఇంత గొప్ప పథకం తెచ్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. దళితులు తమ జీవితాలను మలచుకునేందుకు ఈ పథకం ఎంతగానో తోడ్పడుతుంది. హుజూరాబాద్లో ప్రారంభించిన రైతుబంధు పథకం రైతాంగానికి ఏ స్థాయిలో భరోసా ఇచ్చిందో.. అదే స్ఫూర్తితో దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది.
దళితజాతికి బాంధవులు
ఈ పథకం దళితుల జీవితాల్లో పెను మార్పులు తెస్తుంది. స్వాతంత్య్రం వచ్చిన ఏడున్నర దశాబ్దాల చరిత్రలో దళితుల జీవితాల్లో సీఎం కేసీఆర్ చెరగని ముద్రవేశారు. కల్యాణలక్ష్మితో సీఎం కేసీఆర్ పెండ్లి కూతురుకు మేనమామ అయినట్టే, దళిత బంధు ద్వారా దళితజాతికి బాంధవులు అయ్యారు.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. గత ప్రభుత్వాలు దళితుల కోసం ప్రకటించిన పథకాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. రైతుబంధు, రైతుబీమా సక్సెస్ అయినట్టే దళిత బంధు కూడా సక్సెస్ అవుతుంది. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితుల అభివృద్ధికి ఈ పథకం ఉపకరిస్తుంది.
బృహత్తర పథకం
దళిత బంధు బృహత్తర పథకం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దళితులను చేర్చడమే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు లక్ష్యం. ఈ పథకాన్ని హుజూరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నందుకు కృతజ్ఞతలు.
శాశ్వత వెలుగులకే
దశాబ్దాల కాలంగా దళితులు సామాజికంగా, ఆర్థికంగా పేదరికంలో మగ్గుతున్నారని గ్రహించిన సీఎం కేసీఆర్ వారి కుటుంబాల్లో శాశ్వత వెలుగులు నింపాలన్న ధ్యేయంతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. దళితులను ఓట్ల కోసం వాడుకొనే నాయకులే దేశమంతా ఉంటే అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో చిత్తశుద్ధితో వెలుగులు నింపుతున్నారు. ఈ పథకం దేశానికి దిశానిర్దేశం చేస్తుంది.
దళితులకు ఆశాదీపం
దళిత బంధు అంబేద్కర్ ఆశించిన దళితుల ఉద్ధరణకు ఆశాదీపం. దళితులు చిన్నతరహా కుటీర పరిశ్రమల యజమానులుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు పథకం విజయవంతంగా అమలు కావడానికి సర్కారుకు తోడ్పడాలి.
అణగారినవర్గాల ఆశాకిరణం సీఎం కేసీఆర్
అణగారినవర్గాలకు సీఎం కేసీఆర్ ఆశాకిరణం. దళితుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. దళిత బంధు దళితుల జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపుతుంది. సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడుతుంది. పథకాన్ని రూపొందించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.