సీపీఎం నేత తమ్మినేని ప్రశంస
ఇబ్రహీంపట్నం, జూలై 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఎంతో బాగుందని, దీన్ని తాము స్వాగతిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ జీఎస్టీ పేరిట పేద ప్రజలపై కోట్లాది రూపాయల భారం మోపుతుందని విమర్శించారు. గతంలో కంటే ఈ రెండు మూడు నెలల కాలంలోనే పెట్రోల్, డీజిల్ ధరలను విఫరీతంగా పెంచిందని, ఫలితంగా లీటర్ ధర వంద రూపాయలు దాటిందన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ పేద ప్రజలను నట్టేట ముంచుతున్నదని మండిపడ్డారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని తమ్మినేని హెచ్చరించారు. తెలుగు రాష్ర్టాల మధ్య నీటి సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం ప్రభుత్వం సాగునీటికి సంబంధించిన అధికారాలను తమ ఆధీనంలో తీసుకోవడం దారుణమన్నారు.