హుజూరాబాద్లో మంత్రి గంగుల
మంత్రి కొప్పులతో కలిసి సీఎం బహిరంగ సభాస్థలి పరిశీలన
హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 3: దేశ చరిత్రలో ఎవరూ చేపట్టని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో దళితబంధు లాంటి మంచి పథకాన్ని తీసుకొచ్చినందుకు ఆనందంగా ఉన్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్లో ఈ నెల 16న సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభా స్థలాన్ని మంగళవారం మంత్రి కొప్పులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గంగుల మా ట్లాడుతూ.. తెలంగాణ దళితులకు ఇస్తున్న పది లక్షలకు అదనంగా మరో రూ.40 లక్షలు కేంద్రం నుంచి తేవాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ బండి సంజయ్ని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనీసం నీరు, కరెంటు సైతం ఇవ్వడం లేదని మండిపడ్డారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని స్పష్టమవుతుందన్నారు. దమ్ముంటే బీజేపీ నాయకులు దళిత బంధు కు ప్రధాని నుంచి నిధులు తేవాలన్నారు. ఈ నెల 16న సీఎం సభను దాదాపు లక్ష మందితో పరిమిత సంఖ్యలో నిర్వహిస్తున్నామన్నారు. మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. దళితులను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.