కరీంనగర్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ‘దళితులెవరూ ఆందోళన చెందొద్దు.. తప్పుడు మాటలు నమ్మొద్దు.. అర్హులందరికీ దళితబంధు అందుతుంది’ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రకటించారు. ప్రభుత్వం నగదు వెనక్కి తీసుకుంటుందని కొన్ని మీడియా చానళ్లు చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి కొట్టిపారేశారు. రేషన్కార్డు ఉండి 65 ఏండ్లలోపు వారందరికీ రూ.10 లక్షలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన హుజూరాబాద్లో మిగిలిన వారి ఖాతాల్లో మరో మూడు రోజుల్లో నగదు జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ దిశగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మ న్ బండ శ్రీనివాస్, కలెక్టర్ కర్ణన్, అధికారులతో కలిసి మంత్రి హరీశ్రావు దళితబంధు అమలు పై సమీక్షించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడారు. దళితబంధు పథకం కింద వచ్చే రూ.10లక్షలతో నాలుగు వేర్వేరు యూనిట్లు స్థాపించుకోవచ్చని సూచించారు. దళితుల ఖా తాల్లో పడిన డబ్బులు ప్రభుత్వం వెనక్కి తీసుకోదని, ఈ డబ్బును స్వయం ఉపాధి కోసం వినియోగించుకోవాలని సూచించారు. యూని ట్లు ఏర్పాటు చేసుకునే వరకు ఖాతాలో ఉండే నగదుకు వడ్డీ చెల్లిస్తామన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని బ్యాంకుల్లో హెల్ప్ డెస్క్లు ప్రారంభించి లబ్ధిదారులకు తగిన సలహాలు, సూచనలు అందించాలని బ్యాంకర్లను కోరారు. డబ్బులు జమైన లబ్ధిదారులకు రెండు రోజుల్లో మెస్సేజ్లు పంపించాలని ఆదేశించారు. మంగళవారం నియోజకవర్గంలో పర్యటించి డబ్బులు రాని వారి వివరాలను సేకరించి వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలన్నారు.
23న లబ్ధిదారులతో టెలికాన్ఫరెన్స్..
ఈనెల 23న హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల లబ్ధిదారులతో విడతల వారీగా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, ఇందులో తనతోపాటు మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్, హనుమకొండ కలెక్టర్లు, క్లస్టర్ అధికారులు పాల్గొంటారని మంత్రి హరీశ్రావు తెలిపారు. పథకం అమలులో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులున్నా పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, పెద్ది సుదర్శన్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, హనుమకొండ అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జడ్పీ సీఈవో ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.