వీణవంక, ఆగస్టు 2: కరీంనగర్ జిల్లా మామిడాలపల్లి గ్రామంలోని దళిత కాలనీ ప్రజలు మురిసిపోతున్నారు. తమ కాలనీని ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటుచేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో సోమవారం వారు సంబురాలు చేసుకున్నారు. కాలనీలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. తమ కాలనీ జనాభా 800, ఈ కాలనీ పంచాయతీకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నారు. ఇటీవల దళిత బంధుపై హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో తమ గ్రామ సమస్యలు తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఎస్సీ కాలనీని ప్రత్యేక పంచాయతీ చేస్తామని హామీ ఇచ్చారని ఆ మేరకు అధికారులు వచ్చి సర్వే చేస్తుంటే కొందరు కావాలనే రాజకీయం చేస్తూ ప్రత్యేక జీపీ వద్దంటూ ధర్నా చేస్తున్నారంటూ మండిపడ్డారు. పంచాయతీ ఏర్పాటు చేయాలని గ్రామసభలోనూ ప్రత్యేక తీర్మానం చేశారని, కాలనీవాసులంతా ప్రత్యేక గ్రామ పంచాయతీ కావాలని కోరుకుంటున్నారని చెప్పారు.