హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): దళితుల ఆర్థిక పురోగతికి, స్వాలంబనకు దళితబంధు పథకం దోహదపడుతుంది అనటంలో ఎలాంటి అనుమానాలు లేవని హైకోర్టు పేర్కొంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ పథకం అమలును ఎన్నికల కమిషన్ నిలిపివేయటాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ ఏ రాజశేఖర్రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది. పథకం అమలును నిలిపివేయటం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగానే ఉన్నదా? అన్న అంశాన్ని తేల్చుతామని పేర్కొంది. ఈ పిటిషన్లపై వాదనలు ముగియటంతో ధర్మాసనం తీర్పును రిజర్వులో పెట్టింది.
ఎన్నికల నోటిఫికేషన్కు ముందునుంచే..
దళితబంధు పథకం హుజూరాబాద్ నియోజకవర్గంలోనే అమలవుతున్నదన్న వాదనను రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇది రాష్ట్రం మొత్తం అమలవుతున్న ప్రాజెక్టు అని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు అడ్వొకేట్ జనరల్ జే రామచంద్రరావు తెలిపారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారని, ఆ తర్వాతే హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా మొదలైందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఇతర జిల్లాల్లో కూడా పథకం అమలవుతున్నదని చెప్పారు. ఒక విధంగా దళితబంధును పైలట్ ప్రాజెక్టుగా పరిగణించడానికి వీల్లేదన్నారు.
దినమాగినా దళితులకు దుస్థితే
పథకం నిలిపివేతను సవాలుచేస్తూ పిల్ దాఖలుచేసిన సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య తరఫు న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపిస్తూ.. వారంపది రోజులపాటు పథకం ఆగితే ఏమవుతుందని ఈసీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దారిద్య్రంలో కొట్టుమిట్టాడే దళితుడి ఆకలి బాధను చూస్తే పథకం అమలును ఒకరోజు కూడా ఆపేందుకు వీల్లేదని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల షెడ్యూల్ వెల్లడికి ముందు అమల్లో ఉన్న పథకాలను నిలిపివేసే అధికారం ఈసీకి లేదని తెలిపారు. ఈసీ నిర్ణయం ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.
ఫిర్యాదు చేసిందెవరో తేలాలి
పథకం అమలును నిలిపివేయాలని ఈసీకి ఎవరు ఫిర్యాదు చేశారో తేల్చాలని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది శరత్కుమార్ కోరారు. ఎన్నికల షెడ్యూల్కు ముందే తళితబంధు అమల్లోకి వచ్చినందున దీనిని ఆపేందుకు వీల్లేదన్నారు. పథకం అమలును రాజకీయ పార్టీలు వ్యతిరేకించకున్నా ఈసీ ఎలా నిలిపివేస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల షెడ్యూల్ వెల్లడించాక ఈసీకి సర్వాధికారాలు ఉన్నప్పటికీ, అవి రాజ్యాంగం అధికరణలు, సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఉండరాదని పేర్కొన్నారు. దళితబంధు విషయంలో ఈసీ తన పరిధిని అతిక్రమించిందని వాదించారు. ఈ వాదనలతో ఈసీ తరఫు న్యాయవాది అవినాష్ దేశాయ్ విభేదించారు. అన్ని పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును తర్వాత వెల్లడిస్తామని ప్రకటించింది.