కరీంనగర్ : హుజూరాబాద్లో లక్ష మందితో దళిత బంధు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ నెల 16న సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభా స్థలాన్ని మంగళవారం మంత్రి కొప్పులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు లేవని, 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా లాంటి అద్భుత పథకాలు అందిస్తున్న ప్రభుత్వంలో భాగస్వామ్యమైనందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు.
దళితుల ఓట్లతో దేశంలో ఎంతో మంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయినవారున్నారు. కానీ దళితుల పట్ల ఏ ఒకరూ చిత్తశుద్ధిని కనబర్చలేదని దుయ్యబట్టారు. కేవలం ఓటు బ్యాంకుగా చూడడం వల్లే దళితులు మరింత నిరుపేదలయ్యారని మండిపడ్డారు. కానీ దేశ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో దళిత బంధు లాంటి మంచి పథకాన్ని తీసుకొచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు.