న్యూఢిల్లీ : కేరళ సీఎం పినరయి విజయన్ గోల్డ్, డాలర్ స్మగ్లింగ్ కేసుపై నోరు మెదపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కేరళ ప్రజలకు సీఎం విజయన్ సమాధానం చెప్పాలని అన్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేష్ను విజయన్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని ఈడీ అధికారులు ఒత్తిడి చేశారంటూ కేరళ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం రాజకీయ స్టంట్గా ఆయన అభివర్ణించారు. ఈ కేసులో వాస్తవాలేంటో అందరికీ తెలుసునని ఓ జాతీయ టీవీ ఛానెల్తో మాట్లాడుతూ అమిత్ షా పేర్కొన్నారు.
ఈ స్కామ్లో సీఎం ప్రమేయం లేకుంటే ముఖ్య కార్యదర్శిని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాషాయ పార్టీని నిరుత్సాహపరుస్తాయని విజయన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కమ్యూనిస్టులు ప్రపంచవ్యాప్తంగా కనుమరుగవుతున్నారని వ్యాఖ్యానించారు. కేరళ ప్రజలు ఎల్డీఫ్, యూడీఎఫ్ల పాలనతో విసిగిపోయారని త్రిపునిధురలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీని ప్రత్యామ్నాయంగా ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో తాము మెరుగైన ఫలితాలు రాబడతామని విశ్వాసం వ్యక్తం చేశారు.