హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్దాడులు, డాటా చోరీ ఘటనలకు 85% వ్యక్తిగత కక్షలే కారణమని వెరిజన్ కంపెనీ ఇటీవల విడుదల చేసిన డీబీఐఆర్ (డాటా బ్రీచ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్)-2021 వెల్లడించింది. కరోనాతో ఏర్పడిన గడ్డు పరిస్థితులు, ఇంటి నుంచే పని తదితర కారణాలు సైతం డాటా దోపిడీ పెరుగుదలకు అనుకూలంగా మారాయని తెలిపింది. కొవిడ్ పరిస్థితులను సైబర్ నేరగాళ్లు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఈ నివేదిక స్పష్టంచేసింది. గత రెండేండ్లుగా పరిశీలిస్తే ఫిషింగ్ (ఈ మెయిల్స్, మెస్సేజ్ రూపంలో లింకులు పంపడం) దాడులు అత్యధికంగా ఉన్నట్టు వెల్లడించింది. ఏడాది కాలంగా జరిగిన మొత్తం సైబర్దాడుల్లో 36% ఫిషింగ్ తరహావేనని పేర్కొన్నది. గతేడాదితో పోలిస్తే ఈ దాడులు 20% పెరిగినట్టు వెల్లడించింది. డెస్క్టాప్ షేరింగ్ వెబ్అప్లికేషన్స్ ద్వారా హ్యాకింగ్ ముప్పు రెండోస్థానంలో నిలిచినట్టు తెలిపింది. గతంలో పోలిస్తే ఈ తరహా మోసాల్లో 89% పెరుగుదల నమోదైనట్టు నివేదిక పేర్కొంది.