హుస్నాబాద్, జూన్ 22 : ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన హుస్నాబాద్లోని రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. జాతర చివరి మంగళవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ అధికారులు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. సుమారు అరకిలోమీటరు వరకు భక్తులు దర్శనం కోసం క్యూలైన్ కట్టారు. దీంతో అమ్మవారి దర్శనానికి సుమారు రెండు గంటలు పట్టింది. అమ్మవారికి ఒడిబియ్యం, చీరె, పట్నం వేసి బోనం సమర్పించడం తదితర మొక్కులు చెల్లించుకున్నారు. కొవిడ్-19 నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు. పలువురు భక్తులకు టెంపరేచర్ను పరిశీలించారు. ఆలయ కమిటీ చైర్మన్తో పాటు డైరెక్టర్లు, ఆలయ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.