హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు చొరవతో తలసేమియా బాధితులకు ఊరట లభించింది. తలసేమియా రోగులకు సరైన సమాయానికి రక్తమార్పిడి చేయటం చాలా ముఖ్యం. జీపీ సింగ్ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్ను ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ ‘నా మనవరాలు తలసేమియా బాధితురాలు. పుణెలోని దీననాథ్ మంగేస్కర్ దవాఖానలో సాధారణ రక్తమార్పిడి కోసం రిజిస్టర్ చేసుకొన్నాం. ఈనెల 23న రక్తమార్పిడి జరగాల్సి ఉన్నది. ఈ-పాస్ కోసం దరఖాస్తు చేస్తే నిరాకరించారు. తనకు సకాలంలో రక్తం ఇవ్వకపోతే చాలా ప్రమాదం. ఈ విషయాన్ని తెలియజేస్తూ నా కోడలు మళ్లీ ఈ-పాస్ కోసం దరఖాస్తు చేసింది. దయచేసి ఈ-పాస్ ఇప్పించగలరు’ అని జీపీసింగ్ ట్వీట్ చేశారు. స్పందించిన మంత్రి.. తలసేమియా వ్యాధిగ్రస్తులను ప్రత్యేక పరిస్థితులుగా గుర్తించి పాస్లు జారీ చేసే విషయంలో సిబ్బందికి సూచనలు ఇవ్వాలని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డిని కోరారు. తక్షణం స్పందించిన డీజీపీ.. అన్ని మెడికల్ ఎమర్జెన్సీలను ఈ-పాస్ పోర్టల్, తెలంగాణ స్టేట్ పోలీస్ వెబ్సైట్లో సులభతరం చేస్తున్నట్టు తెలిపి, సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇప్పటికే కరోనా రోగులకు వైద్యసహాయం అందించేలా కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్.. తాజాగా, తలసేమియా బాధితులకు కూడా ఊరట కలిగించారు.