మహబూబ్ నగర్: అవసరం ఉన్నా లేకపోయినా సిటీ స్కాన్ రాస్తూ కొందరు డాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారని, అర్హత ఉన్న డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్ ప్రకారమే సిటీ స్కాన్ తీయాలని ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. కరోనా వల్ల ఎందరో నిరుపేదలు సిటీ స్కాన్ తీసుకునేందుకు ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్ లోకి వస్తున్నారని.. పేదలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీటికి ఫిక్స్డ్ ధరలు విధిస్తున్నామని ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సిటీ స్కాన్ ధరలు రూ. 1999గా నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఫిల్మ్ తో సహా రిపోర్ట్ కావాలంటే రూ. 2790 చెల్లించాల్సి ఉంటుందన్నారు. కరోనా కష్టకాలంలో నిరుపేదలకు ఇబ్బంది కాకుండా ఉండేందుకు సిటీ స్కాన్ ధరలను రూ. 5 వేల నుంచి రూ. 1999కు తగ్గించినట్లు మంత్రి వెల్లడించారు.
వరంగల్, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలలో సిటీ స్కాన్ ధరను రూ.2 వేలకు తగ్గించారని.. అదే బాటలో మహబూబ్ నగర్ జిల్లాలోనూ తగ్గించినట్లు ఆయన తెలిపారు. సోమవారం నుంచే ఈ ధరలు అమలులోకి వచ్చాయని తెలిపారు. కొందరు వైద్యులు 30 నుంచి 40 శాతం సిటీ స్కాన్ రెఫరల్ ఫీజుకు ఆశపడి అవసరం ఉన్నా లేకపోయినా రోగులను డయాగ్నోస్టిక్ సెంటర్లకు పంపిస్తున్నారని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఒక్క సిటీస్కాన్ వల్ల భవిష్యత్తులో దుష్పరిణామాలు ఉంటాయన్నారు. అందుకే క్వాలిఫైడ్ పల్మోనాలజిస్ట్ మాత్రమే సిటీ స్కాన్ రాయాలన్నారు. తగ్గించిన సిటీ స్కాన్ ధరలు అమలు చేయకుంటే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.
జిల్లాలో 13 దవాఖానాల్లో వైద్యం అందిస్తున్నారని ఇందులో 1345 పడకలు ఉండగా 20శాతం అంటే 269 పడకలు ప్రభుత్వానికి కేటాయింపు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రైవేట్ లోని ఈ 269 పడకలు అత్యంత నిరుపేదలకు కేటాయిస్తామన్నారు. ఇంజక్షన్లు, మందుల ఫీజులు మాత్రమే వసూలు చేయాలని తెలిపారు.
ప్రైవేట్ దవాఖాన యాజమాన్యాలు ప్రస్తుతం నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల్లో పేదల నుంచి అత్యధిక ఫీజులు వసూలు చేసి వాళ్లను ఇబ్బందులకు గురి చేయవద్దని మానవత్వంతో స్పందించాలని కోరారు.
మహబూబ్నగర్ జనరల్ దవాఖాన లో హైదరాబాద్ కార్పొరేట్ స్థాయిలో అధునాతన వైద్యం అందిస్తున్నారని మంత్రి తెలిపారు. వ్యాధి ముదిరే వరకు చూడకుండా లక్షణాలు కనిపించగానే ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ, అడిషనల్ కలెక్టర్ నందలాల్ పవార్, డీఎంహెచ్ఓ డా కృష్ణ, ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్స్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మహబూబ్నగర్ ఎంపీపీ సుధా శ్రీ ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన చెన్నూర్ పోలీసులు
వనపర్తి జిల్లాకు నూతనంగా ఐదు వెంటిలేటర్లు
పర్వతగిరి పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే ఆరూరి
కోల్కతా సీబీఐ ఆఫీస్ ముందు టీఎంసీ ఆందోళన
కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి